హైదరాబాద్లో కాన్సులేట్ రోడ్డుకు
ట్రంప్ పేరు పెట్టొద్దు
నిరసన కార్యక్రమాలకు లెఫ్ట్ పార్టీల పిలుపు
20న రౌండ్ టేబుల్ సమావేశం, 21 ప్రదర్శన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ వద్ద ఉన్న ఓ ప్రధాన రహదారికి అమెరికా అద్యక్షులు డోనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేశాయి. బుధవారం హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో వామపక్ష పార్టీల సమావేశం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకునేలా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఈ నెల 20న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉదయం 10.30 గంటలకు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం, 21న బాబూ జగ్జీవన్రాం విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన జరపాలని సమావేశం నిర్ణయించింది. ‘అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడానికి ప్రజల మీద యుద్ధాలను రుద్దుతున్నది. భారత దేశం మీద ట్రంప్ ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. ఇందుకు ప్రధాని నరేంద్రమోడీ సహకారం తోడవటంతో దేశం నష్టపోతున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ బాటలో నడుస్తోంది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకుని రాష్ట్రంలోని పరిస్థితిని చక్కదిద్దాలి’ అని సమావేశం అభిప్రామపడింది. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్, డీజీ నర్సింహారావు, సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు ఇటి.నర్సింహ, నాయకులు స్టాలిన్, సీపీఐ(ఎంఎల్`మాస్లైన్) రాష్ట్ర నాయకులు కె రమ, సూర్యం, ఎంసీపీఐ(యు) రాష్ట్రకార్యదర్శి గాదగోని రవి, న్యూ డెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శివరవ్గ సభ్యులు సాదినేని వెంకటేశ్వరరావు, ఎస్యుసీఐ (సి) నాయకులు పి.తేజ, ఆర్ఎస్పీ రాష్ట్రకార్యదర్శి జానకి రాములు పాల్గొన్నారు.



