కేసీఆర్ ప్రభుత్వంలో విద్య, వైద్యాన్ని గాలికి వదిలేసారు..
గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు అప్పుచేసి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దోచి పెట్టారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు..
మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
నవతెలంగాణ – మునుగోడు
దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ పథకాన్ని తీసుకొచ్చిందని, ఈ పాఠశాలలు పూర్తయిన తర్వాత దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపు చూడడం ఖాయం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడులోని దుబ్బ కాలువ రోడ్డులో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, టీ జీ ఈ డబ్ల్యు ఐ డి సి ఎండి గణపతి రెడ్డి గార్లతో కలిసి భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్ననాడు చదువుకునేటప్పుడు బడిలో కులాల గురించి తెలియదని అన్నారు.
అన్ని కులాల వాళ్ళం ఒకే బడిలో చదువుకునేవాళ్ళమని, మళ్లీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో కులాలకు అతీతంగా అందరూ కలిసి చదువుకోవచ్చు అని అన్నారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో రూ. 200 కోట్ల వ్యయంతో 2500 మంది విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణం చేసుకోవడం శుభపరిణామం అని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు.
వీటిలో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు చదువుకోబోతున్నారు అని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం విద్య వైద్యాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. కొందరికి బర్లిచ్చారు, కొందరికి గొర్లిచ్చారు, కొందరికి చేప పిల్లలు ఇచ్చారు కానీ నాణ్యమైన విద్యను అందించలేదు అని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.76 లక్షల ముప్పై ఐదువేల 115 మంది విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నారు.
ప్రైవేట్ సెక్టార్ లో 44 లక్షల మంది విద్యార్థులు చదివితే ప్రభుత్వ సెక్టార్లో 24 లక్షల మంది చదువుతున్నారు అని అన్నారు. తెలంగాణలో విద్య మొత్తం కార్పోరేట్ చేతిలోకి వెళ్ళిపోయిందని తెలిపారు. కనీసం 50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్లో చదివే అవకాశం రావాలి అని అభిప్రాయపడ్డారు. బడ్జెట్లో విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని, బడ్జెట్లో 10 నుండి 15 శాతం బడ్జెట్ కేటాయిస్తే లక్ష్యం నెరవేర్చుకోవచ్చని ప్రభుత్వానికి సూచించారు.
మునుగోడు నియోజకవర్గంలో 330 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వెల్లడించారు. వీటిలో చదివే విద్యార్థుల సంఖ్య 9, 700 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని ప్రజలకు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెస్ చార్జీలను పెంచాం, విద్య విషయంలో రాబోయే రోజుల్లో చాలా చేయాల్సి ఉంది అని అన్నారు. హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, నల్గొండ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం మునుగోడు నియోజకవర్గం అని అన్నారు. మునుగోడు నియోజకవర్గంకు మొట్టమొదటి అడుగు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం నల్గొండ జిల్లా అంటే రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ జూన్ , రాజకీయాలను శాసించే జిల్లా నల్గొండ అని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత ఉంది: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ప్రభుత్వ పాఠశాలలలో టీచర్ల కొరత తీవ్రంగా ఉందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రారంభ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజ్ గోపాల్ రెడ్డి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు.భవిష్యత్తులో పేద విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యను అందించే ప్రయత్నం జరుగుతుంది ,ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో విద్యకు తక్కువ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి ,అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో అరకోర వసతులు ఉన్నాయి అని అన్నారు. విద్యా వైద్యంపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలివిద్యా వైద్యాన్ని కార్పొరేట్ శక్తులు వ్యాపారంగా మార్చాయి అని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని ప్రభుత్వాని కోరారు.నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల రావడం శుభ పరిణామం అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీదేవి , ఇన్చార్జి తాసిల్దార్ నరేష్ , ఎంపీడీవో యుగంధర్ రెడ్డి , మాజీ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి , చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ , చండూర్ మున్సిపాలిటీ చైర్మన్ కోడి శీను , యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి , మాజీ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి , వివిధ గ్రామాల సర్పంచులు , మాజీ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



