జీర్ణక్రియ సరిగా లేకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అజీర్ణం, వికారం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, వాంతులు, విరేచనాలు వంటివి దీని లక్షణాలు. మరి జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం…
ప్రాసెస్ చేయని ఆహారాలు: తక్కువగా ప్రాసెస్ చేయబడిన పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ఆహారాలలో పీచుపదార్థం, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగుల్లోని మంచి సూక్ష్మజీవులను పెంచి, ప్రాసెస్ చేసిన ఆహారాల వల్ల కలిగే మంటను(inflammation) తగ్గిస్తాయి.
సంపూర్ణ ధాన్యాలు: పేగులు సమర్థవంతంగా పనిచేయడానికి ఫైబర్ చాలా అవసరం. గ్యాస్, ఉబ్బరం సమస్యలు ఉన్నవారు ఓట్స్ వంటి తేలికగా కరిగే ఫైబర్ ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది. పులియబెట్టిన కూరగాయలు: కిమ్చి, సార్క్రాట్, మిసో వంటి పులియబెట్టిన ఆహారాలలో ఉండే ప్రత్యేక సూక్ష్మజీవులు జీర్ణవ్యవస్థలోకి చేరి, పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. పెరుగు- కేఫీర్: లైవ్ యోగర్ట్, కేఫీర్ వంటి పానీయాలు పేగుల్లోకి స్నేహపూర్వక బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి, సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడతాయి. అయితే చక్కెర లేని రకాలను ఎంచుకోవడం మరింత శ్రేయస్కరం.
అల్లియమ్ కూరగాయలు: లీక్స్, ఉల్లిపాయలలో ‘ఇన్యులిన్’ అనే ఫైబర్ (ప్రీబయోటిక్) ఉంటుంది. ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఇంధనంగా పనిచేసి, వాటి సంఖ్య పెరగడానికి సహాయపడుతుంది.
అరటిపండు: సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి అరటిపండు చాలా మంచిది. ఇందులో ఉండే కరిగే పీచుపదార్థం, ప్రీబయోటిక్ ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
కొవ్వు చేపలు, గింజలు, విత్తనాలు: వీటిలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఇన్ఫ్లమేటరీ బవెల్ వ్యాధుల (ప్రేగు వాపు వ్యాధులు) ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
లీన్ ప్రోటీన్లు: మాంసం, చేపలను వండే ముందు నిమ్మరసం, వెనిగర్ వంటి ఆమ్ల పదార్థాలతో మ్యారినేట్ చేయడం వల్ల ప్రోటీన్ అణువులు సులభంగా విచ్ఛిన్నమై, జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. పైనాపిల్, బొప్పాయిలలో కూడా ప్రోటీన్లను అరిగించే సహజ ఎంజైములు ఉంటాయి.
కొబ్బరి నూనె: ఇందులోని మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ (MCFAs), లారిక్ యాసిడ్ పిత్తాశయంపై భారం పడకుండా సులభంగా జీర్ణమవుతాయి, అలాగే అవాంఛిత బ్యాక్టీరియాతో పోరాడుతాయి.
హైడ్రేటింగ్ ద్రవాలు: మనం తినే పీచుపదార్థం (ఫైబర్) నీటిని పీల్చుకునే స్పాంజిలా పనిచేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ 6 నుండి 8 గ్లాసుల నీరు లేదా చక్కెర లేని ద్రవపదార్థాలు (పాలు, టీ, కాఫీ) తాగడం చాలా ముఖ్యం.
జీర్ణ సమస్యలంటే ఈ ఆహారాలు తగ్గించాలి
ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు: తెల్ల రొట్టె, మైదా, అన్నం, పాస్తా వంటి శుద్ధి చేసిన ఆహారాలలో ఫైబర్, పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఎర్ర మాంసం(Red Meat): ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం రోజుకు 70 గ్రాముల కంటే ఎక్కువ ఎర్ర మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసాలను తినకూడదు.
కృత్రిమ తీపి పదార్థాలు: చూయింగ్ గమ్, డైట్ ఫుడ్స్లో ఉండే సార్బిటాల్, జైలిటాల్ వంటి పదార్థాలను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.
మద్యం: ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు వారానికి కనీసం రెండు వరుస రోజులైనా మద్యానికి దూరంగా ఉండాలి.
వ్యక్తిగత ట్రిగ్గర్స్: కొంతమందికి మిరపకాయలు, మసాలాలు, వెల్లుల్లి, ఉల్లిపాయల వల్ల గుండెల్లో మంట రావచ్చు. అలాగే పాల ఉత్పత్తుల వల్ల (లాక్టోజ్ అసహనం) కడుపు ఉబ్బరం వస్తే వాటిని పూర్తిగా మానుకోవడం లేదా మితంగా తీసుకోవడం మంచిది.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
మీకు తరచుగా లేదా అత్యవసరంగా మలవిసర్జన అవ్వడం, విరేచనాలతో పాటు తీవ్రమైన నొప్పి రావడం, మలంలో రక్తం పడటం, కడుపులో తిమ్మిర్లు లేదా వారం కంటే ఎక్కువ కాలం గుండెల్లో మంట ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
వాణి అయోధ్య క్లినికల్ డైట్ కన్సల్టంట్
9959361180



