– రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
– పోలీసుల అదుపులో ఆందోళన కారులు
– హైడ్రా కమిషనర్కు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎట్టకేలకు హైడ్రా అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిత్త పరిస్థితుల మధ్య ఒక గ్రూపునకు చెందిన వారు ఈ భూమి తమదే అంటూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దాంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో హైడ్రా, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ రెవెన్యూ పరిధిలోని 354/1 సర్వే నంబర్ రాంబాగ్, శివాలయం మధ్యనున్న ఈ స్థల వివాదం ఆందోళనకు దారి తీసింది. స్థానిక ప్రజలు దీనిపై ఆందోళనకు దిగడంతో గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్తోపాటు రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అని రంగనాథ్ స్పష్టం చేశారు. ఒక మతం పేరిట స్థలాన్ని స్వాధీనం చేసుకున్న వారికి కూడా ఆయన నచ్చజెప్పారు. దీనిపై తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైడ్రా కమిషనర్, ఎమ్మెల్యే సూచనతో అధికారులు ఆదివారం తెల్లవారుజామున భారీ బందోబస్తు నడుమ ఒక గ్రూప్ ఏర్పాటు చేసిన రేకులు, ప్రహారీ, నిర్మాణాలను తొలగించారు. మత సెంటిమెంట్ దెబ్బ తినకుండా కొంత స్థలం వదిలారు. ఈ సందర్భంగా కొందరు అధికారులను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఒక వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి పరిస్థితులు సద్దుమనిగేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం పట్ల పాండురంగానగర్, హైదర్గూడ, అత్తాపూర్ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేశారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని, కానీ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించామని పలు పార్టీలకు చెందిన నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానికులు హైడ్రా చర్యలు అభినందనీయమని కొనియాడుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కాపాడటంతో అన్ని శాఖలను సమన్వయం చేసి రంగనాథ్ తీసుకున్న చర్యలు హర్షనీయమన్నారు. అందుకోసం పూర్తి సహకారం అందించిన ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్తోపాటు వివిధ శాఖల అధికారులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ స్వయ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు.
అత్తాపూర్లో ఆక్రమణలు తొలగించిన హైడ్రా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



