నవతెలంగాణ-హైదరాబాద్: అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. అంతకుముందు అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు టీఏ, డీఏ, సరెండర్ లీవుల బిల్లులు కూడా విడుదల చేయడం లేదని విమర్శించారు. అలాగే, బీసీల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. బీసీల ఆత్మగౌరవ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని.. బీసీ సబ్ ప్లాన్ నిధుల కేటాయింపుపై వైఖరి చెప్పడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగుల అపాయింటెడ్ డేట్ కూడా చెప్పడం లేదని మండిపడ్డారు.



