నవతెలంగాణ – హైదరాబాద్: ఇచ్చిన హామీ ప్రకారం కులగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చాటుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందుకోసం సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వంలోని నేతలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే మాపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. శుక్రవారం శాసనసభలో కులగణనపై చర్చ సందర్భంగా గతంలో బీసీ మంత్రిగా చేసిన గంగుల కమలాకర్ అనేక సార్లు సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలపై నోటికొచ్చినట్లు మాట్లాడటం విచారకరం. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో సకల జనుల సర్వే చేపట్టింది. దానికి సంబంధించిన నివేదికను ఎందుకు బయటపెట్టలేదు? ఇవాళ ఇంత పెద్దగా మాట్లాడుతున్న ఆయన.. ఆ నివేదికను బయటపెట్టాలని ఏనాడైనా ఆ పార్టీ సమావేశాల్లో అడగాలని అనిపించలేదా? అలాంటి స్థితిలో ఉన్నవారు కూడా మాపై విమర్శలు చేస్తున్నారు.