నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఇండియా ఫోరానికి మద్దతుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్యాయానికి వ్యతిరేకంగా ఇండియా ఫోరం ఐక్యంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాటం చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించిన మరుసటి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాహుల్ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం అస్సాం నుండి పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహార్కు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ చౌదరీ సహా పార్టీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. కూచ్బెహార్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశవ్యాప్తంగా విద్వేషం, హింసను వ్యాప్తి చేస్తున్నాయని మండిపడ్డారు. వారి అన్నాయాలను ఎండగట్టేందుకు తన యాత్రలో ‘న్యాయ్’ అనే పదాన్ని చేర్చానని అన్నారు. దేశంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఇండియా ఫోరం పోరాటం కొనసాగుతుందని అన్నారు.