రుణాలిచ్చే ముందు అన్నీ సరిచూసుకోవాలి
హైడ్రా ఏర్పడ్డాక కట్టే అక్రమ కట్టడాలను తొలగిస్తాం
ప్రతి ఒక్కరికీ చెరువు, నాలా హద్దులు తెలిశాయి : వాల్యూయర్స్ సదస్సులో హైడ్రా కమిషనర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
అందరికీ సొంత ఇల్లు ఓ కల.. దానిని సాకారం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమైనదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఇల్లు కొనేందుకు రుణాలిచ్చే ముందు అన్ని విధాలా సరి చూసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. ‘ఐఓవీ’ (ఇనిస్టిట్యూషన్ ఆఫ్ వాల్యూయర్స్) రిజిస్టర్డ్ వాల్యూయర్స్ ఫౌండేషన్, హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ”ట్రాన్స్ఫర్మేటివ్ ఎరాలో వాల్యుయేషన్” అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. గతేడాది జులై 19న హైడ్రా ఏర్పడిందని, అంతకు ముందు వెలిసిన నివాస ప్రాంతాలతోపాటు అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న వాటి జోలికి వెళ్లబోమని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత అక్రమ కట్టడాలు వస్తే వాటిని తొలగిస్తామన్నారు. హైడ్రా అంటే కూల్చవేతలు కాదని.. పర్యావరణ హితమైన నగరాభివృద్ధికి దోహదం చేసే సంస్థగా అందరూ గుర్తిస్తున్నారన్నారు. సుస్థిర వ్యాపారానికి హైడ్రా దోహదం చేస్తోందని అందరూ గ్రహిస్తున్నారని తెలిపారు. ఎలాంటి మోసాలకూ ఆస్కారం లేకుండా సొంతింటి కలను సాకారం చేయడంలో రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు ఆ ఇంటికి రుణాలిచ్చే అర్థిక సంస్థలు కూడా బాధ్యత వహించాలని సూచించారు. సర్వే నంబరు ఒకటి చూపించి.. వేరే చోట ఇండ్ల నిర్మాణం చేపడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సంబంధిత పేపర్లను పరిశీలించామనుకుంటే సరిపోదనీ, క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన బాధ్యత రుణాలు ఇచ్చిన సంస్థలపైనే ఉందన్నారు. ఆర్థిక సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలకు ఆస్తి విలువలను నిర్ణయించడంలో పారదర్శకత, నమ్మకం, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో వాల్యుయేషన్ నిపుణుల పాత్ర చాలా కీలకమైనదన్నారు. నగరంలో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి వరద ముప్పు లేకుండా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనేది హైడ్రా లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే చెరువుల, నాలాలు, పార్కులు, రహదారుల ఆక్రమణలను నిరోధించి, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడేందుకు హైడ్రా ప్రాధాన్యతనిస్తోందన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలతో ప్రతి ఒక్కరికీ చెరువు, నాలా హద్దులు తెలిశాయని చెప్పారు. ఇప్పుడు ఇల్లు కొనాలనుకునేవారు చెరువు ఎఫ్టీఎల్ పరిధిని పరిశీలిస్తున్నారని తెలిపారు. బ్యాంకర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, వాల్యూయర్స్ సందేహాలను కమిషనర్ ఈ సందర్భంగా నివృత్తి చేశారు. ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.రఘు, ‘క్రెడియా’ జాతీయ అధ్యక్షుడు జి.రామిరెడ్డి, ఐవోవీ జాతీయ ఉపాధ్యక్షులు ఆర్.పటేల్, ఐవోవీ ప్రతినిధులు పి.మధు, కె.చిరంజీవితోపాటు, వాల్యుయేషన్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
సొంతింటి కల సాకారంలో బ్యాంకర్ల పాత్ర కీలకం
- Advertisement -
- Advertisement -