Sunday, June 29, 2025
E-PAPER
Homeసోపతి'మా భూమి' నుండి 'చెలిమి కథలు' దాకా...

‘మా భూమి’ నుండి ‘చెలిమి కథలు’ దాకా…

- Advertisement -

‘సరబాద ముఖ్య ప్రాణ్‌ రావు’… బహుశా ఈ పేరు చెబితే నిన్నటి తరానికి విన్నట్టు అనిపించొచ్చు. ముఖ్యంగా ఇటీవల బాల సాహిత్యం రాస్తున్న వాళ్ళకు మాత్రం కొత్తగా వినిపించొచ్చు. కాని ‘ఎస్‌.ఎమ్‌. ప్రాణ్‌రావు’ అంటే మాత్రం రచయితగా… కవిగా… ఆలోచనాపరునిగా తెలంగాణ నేలపై ఆరు దశాబ్ధాలుగా వినిపిస్తున్న పేరు. జన నాట్య మండలికి భూమికనిచ్చిన ఆర్ట్‌ లవర్స్‌ అనుబంధంతో పీడిత ప్రజల బతుకులను, బాధలను చదివిన ప్రాణ్‌రావు 12 ఏప్రిల్‌, 1943న నల్లగొండ జిల్లాలో పుట్టి పెరిగారు. శ్రీమతి సరబాద పద్మావతి – శ్రీ రమణారావులు వీరి అమ్మానాన్నలు. పద్మావతమ్మ కాన్గీర్‌ బడి పంతులమ్మగా ప్రసిద్ధులు. వేలాది మందికి విద్యాదానం చేసిన చదువుల సరస్వతి పద్మావతమ్మ. నల్లగొండలో పాఠశాల విద్య పూర్తిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎ, ఎం.ఎ, చదువుకున్న ప్రాణ్‌రావు హైదరాబాద్‌లో ఆంగ్లోపన్యాసకునిగా పదవీ విరమణ చేశారు.


తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్న ప్రాణ్‌రావు రచనా రంగానికి ముందే సినిమా రంగంలో రాణించారు. చారిత్రాత్మక ‘మా భూమి’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయితగా నంది పురస్కారం అందుకున్న వీరు, ‘మా భూమి’తో పాటు ‘రంగులకల’, ‘మట్టి మనుషులు’ ‘కొమరం భీం’ చిత్రాలకు సహ రచయిత. ‘కొమరం భీం’ చిత్రానికి రచన, సంభాషణలు రాశారు. రచయితగా ఇరవై రెండుకు పైగా రచనలు చేశారు. వీరి ‘నీలిపాప’ పర్యావరణం మీద వచ్చిన తొలి తెలుగు నవల. రుద్రమ మీద వచ్చిన సమగ్ర రచన ‘రుద్రమదేవి’. మాదన్నపై తొలి రచన ‘మహామంత్రి మాదన్న’, ‘ప్రతాపరుద్రుడు’ కూడా తొలిదే. ఇదే కోవలో ‘ప్రజాజ్యోతి పాపన్న’ పేరుతో సర్దార్‌ సర్వాయి పాపన్న గురించి రాశారు. ‘వెన్నెల కోనేరు’, ‘కవిత’, ‘నీలాంబరి’, ‘సిరులలయ్య’, ‘అందం’, ‘నీటినీడ’, ‘పురివిప్పిన నెమలి’, ‘మలగని బత్తి’ (నవలా త్రయం), ‘నేలజారని ఊడలు’, ‘రాణి శంకరమ్మ’ ప్రాణ్‌రావు నవలలు. అవినీతి విశ్వరూపాన్ని చూపించిన అక్షరచిత్రం ‘రాంగ్‌వే’ నవల.

పర్యావరణంపై రాసిన వచన కవిత్వాన్ని ‘హంసగీతి’గా వెలువరించారు. ‘తుఫానుల కెదురు నడవరా’ వీరి మరో వచన కవితా సంపుటి. ‘రుద్రమదేవి- మాచలదేవి’ ప్రాణ్‌రావు నాటకాలు. వీరి రచనలు, వస్తువులను చూస్తే ప్రాణ్‌రావు వైవిధ్యతను, రచయితగా అయన నూతన ఒరవడిని తెలుపుతాయి. ‘సిరులయ్య’ రచనకు ఆంధ్రభూమి సస్పెన్స్‌ నవలల పోటీలో బహుమతి లభించింది. ‘తుఫానుల కెదురు నడవరా’ సంపుటికి 2010లో విశాఖపట్నంలోని సత్యమూర్తి ఛారిటబుల్‌ ట్రస్టు ఉత్తమ కవితా సంపుటి పురస్కారం వచ్చింది. ‘మలగనిబత్తి’ నవల తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం గెలుచుకుంది. ఇది 1908 నుండి 2020 దాకా తెలంగాణను గ్రంథస్తం చేసిన రచన. ఈయన అందుకున్న పురస్కారాల్లో 2023లో డా.కె.ఎల్‌. నరసింహారావు సాహితీ పురస్కారం కూడా వుంది. ‘మహామంత్రి మాదన్న, మెతుకు మాణిక్యం రాణీ శంకరమ్మ’ రచనలు ఆకాశవాణి ఆదిలాబాద్‌ కేద్రం నుండి ప్రసారమయ్యాయి. భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీతలను అధ్యయనం చేసిన ప్రాణ్‌రావు వీటిపైన ప్రవచనాలు చేశారు.


బోధన, రచనల జుగల్‌బందీ ప్రాణ్‌రావు ఎనభయ్యవ దశకం నుండి పిల్లల కోసం రాస్తున్నారు. ముఖ్యంగా బాల వికాసకారులు మణికొండ వేదకుమార్‌ సంపాదకత్వంలో వచ్చిన ‘బాలచెలిమి’ పత్రికలో వీరి అనేక రచనలు అచ్చయ్యాయి. అందులో ‘బెనహర్‌’, ‘బంగారు దీవి’ అనువాద నవలలతో పాటు యాభైకి పైగా వ్యాసాలు, బాలల కథలు ఉన్నాయి. బాల చెలిమిలో అచ్చయిన కథలను ‘చింతామణి’ కలం పేరుతో రాశారు ఆయన. ఈ కథలను ‘చెలిమి కథలు’గా బాల చెలిమి ప్రచురించింది. దీనికి ముందు బాలల నవల ‘డ్రీమ్‌ బారు’ అచ్చయ్యింది. చాలా పుస్తకాలకు ప్రముఖుల ముందుమాటలతో వెలువడడం మనకు తెలుసు. డ్రీమ్‌ బారు బాలల నవల ప్రజా యుద్ధనౌక గద్దర్‌ ‘ముందుపాట’తో వెలువడడం విశేషం. ఇది ఒక పన్నెండేండ్ల బాలుని సాదాసీదా కథ.

అందులోనూ ఈ కథలోని డ్రీంబారు చిలుకజోస్యం పెట్టె పక్కన కూర్చునే డ్రీమ్‌బారు సాయిరాం. ప్రాణ్‌రావు బాల సాహిత్యం చదువుతుంటే బాలల రచనలంటే కేవలం బాలల ఆనందం, నీతి, నియమాలు చెప్పడం కోసమేకాదు… బాల్యంలోని బాధలు, గాథలు కూడా అని చెబుతాయి. ఈయన బాలల కోసం తెచ్చిన ప్రధానమైన ఐదు రచనల్లో ‘చెలిమి కథలు’ ఒకటి. ఇందులోని ప్రతి కథ సాదారణ పిల్లల కథే. ‘అమ్మ’ కథ ఇందులోని మంచికథల్లో ఒకటి. ‘పుట్టినరోజు కానుక’ కూడా ఇటువంటి కథే! వీరి కథలన్నీ కిశోర బాలలు లేదా యంగ్‌ అడల్స్ట్‌ కోసం రాయబడ్డవి. వస్తువు, కథ నిడివిని చూస్తే ఆ విషయం బోధపడుతుంది. ‘డిగ్నిటి’ కథ పనియే దైవం అంటూ డిగ్నిటినీ గురించి చక్కగా చర్చించిన కథ. ఇటువంటివే ఈ సంపుటిలో అనేక కథలు మనకు కనిపిస్తాయి. వీరి కథల్లోని హీరోలందరూ పిల్లలే. ఆ పిల్లలందరూ హైదరాబాద్‌లోని పిల్లలుగానే కనిపిస్తారు. మధ్యతరగతి జీవితాల్లోంచే వస్తారు. అది వీరి రచనల్లోని విశేషం.

ఇటీవల వీరు చేసిన రెండు బాలల నవలలు తెలుగులో ‘బంధం’.. కాగా ఆంగ్లంలో ‘ద బాండేజ్‌’. బంధం నవల క్యాన్సర్‌ సోకిన బాలుడికి సంబంధించిన కథ. మా భూమి’ నుండి ‘చెలిమి కథలు’ దాకా తనదైన శైలిలో రాస్తున్న ప్రాణ్‌రావు నేటి మన బాల సాహిత్యకారులకు అందిన అనుభవాల గని. అందులోనూ తెలంగాణ నేపథ్యంగా వస్తున్న బాల సాహిత్యానికి, బాలల రచనలకు నిక్కమైన పెన్నిధి. జయహో! ప్రాణ్‌రావు! జయహో బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -