రైతాంగం ఉద్యమించాలి
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీపీఐ(ఎం) శాసనసభ పక్షనేత బోడేపూడి వెంకటేశ్వరరావు స్ఫూర్తితో రైతాంగం ఉద్యమించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో బోడేపూడి 28వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పంచారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి, తండ్రి మరణంతో మధిర ప్రాంతం నుంచి వైరా గండగలపాడు మేనమామ ఇంటికి తల్లితోపాటు చేరిన ఆయన బంధువుల ఇంట్లో జీతం చేస్తూ…తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో సింగరేణి బొగ్గు గని కార్మికుల నేత డి. శేషగిరిరావుకు ఉత్తర ప్రత్యుత్తరాలు చేరవేసే కొరియర్ బాధ్యతలు నిర్వహించాలని గుర్తు చేశారు.వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారని తెలిపారు. రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఖాజా రాధాకృష్ణమూర్తి సూచనతో పాఠశాల ప్రారంభించి విద్యా వ్యాప్తికి ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. వైరా రిజర్వాయర్, నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో చివరి భూములకు సాగు నీరు అందించేందుకు నిరంతరం కృషి చేశారని తెలిపారు. గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణాలు, పరిహారం, నాణ్యమైన విత్తనాలు కోసం, దళారుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి రైతు బాంధవుడుగా కీర్తి ప్రతిష్టలు పొందారని చెప్పారు. సరైన తాగునీరు లేకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారంటూ సుజల స్రవంతి పథకం కోసం పాలకులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, పి జంగారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
బోడేపూడి స్ఫూర్తితో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES