– విచారణ ఆగస్టు 28కి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘ఓటుకు నోటు’ కేసు విచారణను ఆగస్టు 28కి వాయిదా పడింది. ‘ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలో రాదంటూ నిందితులుగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. సీనియర్ న్యాయవాది లేనందున మూడు వారాల పాటు కేసు వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి తరఫున జూనియర్ న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీవ్ రావల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతేడాది జనవరిలో చివరి సారిగా పిటిషన్ విచారణకు వచ్చిందని, అప్పుడు వాయిదా కోరారని, 2015లో ఈ ఘటన చోటు చేసుకుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.