హోటల్ లో భోజనం చేస్తున్న వారిపై పడ్డ క్షిపణి…

నవతెలంగాణ – ఉక్రెయిన్
రష్యా దాడులతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్ లో మరో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఉక్రెయిన్ లోని ఓ రెస్టారెంట్ పై రష్యా రెండు క్షిపణులతో దాడి చేసింది. దీంతో ఆ బిల్డింగ్ ధ్వంసం కాగా.. శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ పోలీసులు తెలిపారు. డిన్నర్ సమయం కావడంతో రెస్టారెంట్ లో జనం ఎక్కువగా ఉన్నారని, అదే సమయంలో దాడి జరగడంతో చాలామంది శిథిలాల కింద చిక్కుకుపోయారని వివరించారు. ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సిటీ క్రమటోర్స్క్ లోని ఫేమస్ రెస్టారెంట్ రియా లాంజ్ తో పాటు అక్కడికి దగ్గర్లోని ఓ షాపింగ్ సెంటరపైనా ఈ క్షిపణి దాడులు జరిగాయి. సాయంత్రం 7:30 గంటల (లోకల్ టైం) ప్రాంతంలో ఈ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ సమయంలో రెస్టారెంట్ లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉందని చెప్పారు. రెస్టారెంట్ లో దాదాపు 80 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని సమాచారం. అక్కడికి దగ్గర్లోని షాపింగ్ సెంటర్ పై జరిగిన దాడిలో ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదని, 56 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

Spread the love