మూడు రోజులుగా తల్లిదండ్రుల మృతదేహాల మధ్య నవజాత శిశువు…

నవతెలంగాణ – ఉత్తరాఖండ్​
ఉత్తరాఖండ్​.. దెహ్రాదూన్ ఓ ఇంట్లో ఇద్దరు దంపతులు మూడు రోజులుగా విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని కుళ్లిపోయిన మృతదేహాల మధ్య సజీవంగా ఉన్న చిన్నారిని చూసి షాక్​కు గురయ్యారు. వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. మరణించిన వారిని కాసిఫ్​, ఆనమ్​లుగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటన జూన్ 13వ తేదీన వెలుగుచూసింది. నాగల్ జిల్లా సహరాన్​పుర్​కు చెందిన కాసిఫ్​కు ఆనమ్ రెండో భార్య. వీరిద్దరూ టర్నర్​ రోడ్డు C-13లోని సొహైల్​ అనే వ్యక్తి ఇంట్లో నాలుగు నెలలుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో జూన్ 9న ఆనమ్.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. అదే రోజు సాయంత్రం ఆనమ్​ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యింది. నాలుగు రోజుల వ్యవధిలో ఆనమ్​, ఆమె భర్త ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిది ఆత్మహత్య అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కాసిఫ్ తనతో జూన్ 10వ తేదీ రాత్రి చివరిసారిగా మాట్లాడాడని.. మరుసటి రోజు సహరాన్​పుర్​కు వస్తానని చెప్పాడని కాసిఫ్ మొదటి భార్య నుస్రత్ పోలీసులకు తెలిపింది. కాసిఫ్​కు చాలా అప్పులు ఉన్నాయని.. ఇటీవల ఓ వ్యక్తి దగ్గర జూన్ 11న రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడని చెప్పింది. చిన్నారిని ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికి స్పృహలోనే ఉన్నాడని డాక్టర్ ధనంజయ్ ధోవల్ తెలిపారు. అయితే శరీరంపై చాలా పురుగులున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ‘బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. తగినంత బరువు కూడా ఉన్నాడు. ఐసీయూలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కానీ మూడు రోజుల పాటు తల్లిపాలు కూడా లేకుండా పిల్లవాడు ఆరోగ్యంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది’ అని చిన్నారికి వైద్యం అందిస్తున్న డాక్టర్ ధనుంజయ్ తెలిపారు.

Spread the love