రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ది ఇండియన్ స్టోరి’. చమ్మక్ చంద్ర, ముక్తార్, రామరాజు, సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు, అనంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ భీమ్ రెడ్డి నిర్మించారు. మన సమాజంలో మత సామరస్యం ఉండాలనే మంచి సందేశంతో అన్ని కమర్షియల్ అంశాలు కలిపి ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి. నేడు (శుక్రవారం) ఈ సినిమా గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్కు వస్తోంది.
ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను రామా నాయుడు స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ మెంబర్స్కు మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ‘అన్ని మతాలూ సమానమే. మనుషులంతా ఒక్కటే అనే మంచి కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించాం. కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థంతో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ విషయాన్ని మా మూవీలో చర్చించాం. దీంతో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మా టీమ్కు హెచ్చరికలు చేశారు. మాపై కేసులు పెట్టారు. దాడులు చేసేందుకు ప్రయత్నించారు. అయినా మేము భయపడకుండా సినిమాను రిలీజ్కు తీసుకొస్తున్నాం’ అని అన్నారు. నిర్మాత, హీరో రాజ్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఈ సినిమాని మేము నిర్మించడం వెనక ఎలాంటి రాజకీయ శక్తులు లేవు. ఒక మంచి సందేశాత్మక సినిమా కమర్షియల్ అంశాలతో రూపొందించే ప్రయత్నం చేశాం. తెలుగు సినిమాల సెన్సార్కు తెలుగు తెలిసిన అధికారులే ఉండాలి. అప్పుడే మన సినిమాల్లోని భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోగలరు’ అని తెలిపారు.