పాత రోజుల్ని గుర్తు చేసే పాట

సాయికుమార్‌, శ్రీనివాస్‌సాయి, ఆదిత్యా ఓం, దీపాలి రాజపుత్‌, ఐశ్వర్య, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని రెట్రో మెలోడీ సాంగ్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ పాట వినగానే మళ్లీ పాత రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా రెట్రో స్టైల్‌లో ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్న శాంతికుమార్‌ సక్సెస్‌ కావాలి’ అని అన్నారు. ‘జబర్దస్త్‌ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాట, పాటలు నేనే రాసి, నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాను. హీరో శ్రీకాంత్‌తో ఈ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ పాట చూస్తే 1980లోకి తీసుకెళ్తుంది’ అని దర్శకుడు శాంతికుమార్‌ చెప్పారు. ‘మంచి కథతో తొలి ప్రయత్నం చేశాం. సాయికుమార్‌ కొత్తగా కనిపిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని నిర్మాత అన్నారు. మంచి కథతో సినిమా చేశామని నటుడు ఆదిత్యా ఓం చెప్పారు.

Spread the love