లంచం కేసులో… విద్యుత్తుశాఖ ఏడీకి నాలుగేండ్లు జైలు శిక్ష

నవతెలంగాణ కరీంనగర్: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(అనిశా)అధికారులకు చిక్కిన విద్యుత్తుశాఖ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌కు నాలుగేండ్లు జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్‌ అనిశా ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళ్లిలే… ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం సిరి చెల్మకు చెందిన గాండ్ల కన్నమయ్య ప్రభుత్వం తత్కాల్‌ స్కీం ద్వారా వ్యవసాయ భూములకు విద్యుత్తు సరఫరా చేస్తుందని తెలిసి మరికొంత మంది రైతులతో కలిసి 2010 అక్టోబరు 12న దరఖాస్తు చేసుకున్నారు. అది స్థానిక అధికారుల నుంచి ఆదిలాబాద్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ రేగుంట స్వామికి చేరడంతో వెళ్లి ఆయన్ను కలిశారు. ఆయన రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పడంతో రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పాడు. దీంతో రైతులు 2010 నవంబరు 18న అనిశా అధికారులను ఆశ్రయించారు. రైతుల నుంచి స్వామి రూ.15 వేలు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకుని, కేసు నమోదు చేశారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కిషోర్‌కుమార్‌ వాదించారు. న్యాయమూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి స్వామికి నాలుగేండ్లు జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Spread the love