నవతెలంగాణ – హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెలెక్టెడ్ అభ్యర్థులు తమకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలంటూ గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం ‘హలో నిరుద్యోగి-ఛలో గాంధీ భవన్’ పేరుతో అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి మోకాళ్ళపై కూర్చొని తమ నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ..1540 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి 9 నెలలు గడుస్తున్నా పోస్టింగ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. గతంలో పేపర్ లీకేజీ కారణంగా తాము ఏఈఈ ఫలితాలు జాప్యం జరగడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డామని తెలిపారు. టీఎస్పీఎస్సీ అధికారులు వెరిఫికేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని తమకు నియామక పత్రాల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలనీ, అంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.