– కరెంట్, తాగునీటి సేవల్నీ బంద్చేస్తాం
– 6న పార్టీలు, ప్రజా, సామాజిక సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం
– 7న రాస్తారోకోలు.. 8,9,10 తేదీల్లో మహాపడావ్లు
– 13, 14 మండల కేంద్రాల్లో రచ్చబండ
– రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ అల్టిమేటం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించకపోతే ఆగస్టు 15 నుంచి సమ్మె ఉధృతం చేస్తామనీ, అత్యవసర సేవలైన కరెంటు, తాగునీటి సరఫరా సేవల్నీ బంద్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. గురువారం హైదరాబాద్లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో జేఏసీ చైర్మెన్ పాలడుగు భాస్కర్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. సమావేశంలో జెఏసీ సలహాదారులు ఎమ్డీ. యూసుఫ్ (ఏఐటీ యూసీ), కె. సూర్యం(ఐఎఫ్టీయూ), వెంకరాజం (ఏఐటీయూసీ), పి. శివబాబు (ఐఎఫ్టీయూ), చాగంటి వెంకటయ్య (సీఐటీయూ), కో-కన్వీనర్స్ పి. సుధాకర్, గ్యార పాండు, శ్రీకాంత్ (సీఐటీయూ), నర్సింహారెడ్డి (ఏఐటీయూసీ), యాదయ్య (ఐఎఫ్ టీయూ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. మల్లీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల వలె గ్రామ పంచాయతీ కార్మికులకూ జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ ప్రభుత్వం ముందుంచిన 14 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సమ్మెను ఉధృతం చేయబోతున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగా ఈ నెల ఆరోతేదీన రాజకీయ పార్టీలు, ప్రజా, సామా జిక సంఘాలతో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నా మన్నారు. ఏడో తేదీన రాస్తారోకోలు చేపట్టాలనీ, 8, 9, 10 తేదీల్లో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగే మహాపడావ్లో భాగ స్వాములు కావాలని పిలుపునిచ్చారు. 8 నుంచి 12వ తేదీ వరకు తమ సమ్మెకు మద్దతివ్వాలని కోరుతూ ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలనీ, కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. 13,14 తేదీల్లో రచ్చబండ కార్యక్రమాలను మండల కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘మాకు స్వతంత్రం రాలేదా? ఇంకెన్నాళ్ళు మాకీ బానిసత్వం? గ్రామ పంచాయతీ సమ్మెను పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా!’ అంటూ ప్లకార్డుల ప్రదర్శనలు మండల కేంద్రాల్లో చేయాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత సమ్మెను ఉధృతం చేస్తామన్నారు.
పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి జేఏసీ వినతి
జేఏసీ సమావేశం అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాకు వినతిపత్రం అంద జేశారు. జేఏసీ నాయకులు ఆయనకు సమ్మె డిమాం డ్ల గురించి వివరించారు. జేఏసీ డిమాండ్లను సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్తామనీ, తమ పరిధిలోని అంశా లను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీనిచ్చారని జేఏసీ నేతలు తెలిపారు. జాప్యం చేయకుండా తక్షణమే చొరవ చూపి సమ్మె డిమాండ్ల ను పరిష్కరించి సమ్మెను నివారించాలనీ, చర్చలకు పిలిస్తే జెఏసి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.