మార్చి 31న ఆ బ్యాంకులన్నీ పనిచేయాలి.. ఆర్బీఐ కీలక ఆదేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్: మార్చి 31వ తేదీ ఆదివారమే అయినప్పటికీ అన్ని ఏజెన్సీ బ్యాంకులు పనిచేయాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం 2023-24కి మార్చి 31 చివరి రోజు కావడంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచ్‌లు తెరిచే ఉండాలని సూచించింది. ప్రభుత్వ రశీదులు, చెల్లింపులతో ముడిపడిన అన్ని బ్యాంకుల బ్రాంచులు అన్నింటిని మార్చి 31 (ఆదివారం) తెరిచి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అవసరమైన బ్రాంచులను తెరచి ఉంచుతున్నామని, సేవలు లభిస్తాయంటూ ప్రచారం కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలిచ్చింది. కాగా బ్యాంకులు సాధారణంగా అన్ని ఆదివారాలు, ప్రతి నెల 2, 4వ శనివారాల్లో మూసి ఉంటాయనే విషయం తెలిసిందే.

Spread the love