శరవేగంగా అంబేద్కర్‌ విగ్రహం పనులు

మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి
నవతెలంగాణ – హైదరాబాద్‌
హుస్సేన్‌సాగర్‌ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులను నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. సోమవారం ఆయన ఆ విగ్రహాన్ని సందర్శించారు. అంబేద్కర్‌ జయంతి రోజైన ఏప్రిల్‌ 14న విగ్రహాన్ని ఆవిష్కరించాలని సీఎం కేసిఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు మంత్రి పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరిగిన అనంతరం అక్కడే అధికారులు, వర్క్‌ ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ అంటే సీఎం కేసిఆర్‌ గారికి ప్రత్యేకమైన ప్రేమ అని అన్నారు. వారు రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్‌ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని తరుచూ ఆయన్ను కీర్తిస్తుంటారుని చెప్పారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు భవిష్యత్‌ తరాలు నిత్యం స్మరించుకునేలా, ఒక దిక్సూచిలా ఉండేలా హుస్సేన్‌సాగర్‌ తీరాన అత్యంత ప్రతిష్టాత్మకంగా 125 అడుగుల విగ్రహం నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. ఏప్రిల్‌ 14న అట్టహాసంగా విగ్రహం ఆవిష్కరించాలని ఇప్పటికే నిర్ణయించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు ప్రముఖులు రానున్నాని వివరించారు. ఏప్రిల్‌ ఐదు లోపు అన్ని రకాల పనులు పూర్తి కావాలని మంత్రి అధికారులకు, వర్క్స్‌ ఏజెన్సీకి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ఆర్‌ అండ్‌ బీ ఈఏన్సీ ఐ గణపతిరెడ్డి, ఎస్‌.ఈలు హఫీజుద్దిన్‌, లింగారెడ్డి, ఈ.ఈ రవీంద్ర మోహన్‌, పలువురు అధికారులు, కేపీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు అనిల్‌, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love