ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు ప్రారంభం

– మొదటిరోజు ఉదయం 94.3 శాతం, మధ్యాహ్నం 94.4 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్‌ (ఎంసెట్‌) రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో ఈనెల ఏడో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. గురువారం నుంచి ఇంజినీరింగ్‌ విభాగం రాతపరీక్షలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఎప్‌సెట్‌ కన్వీనర్‌ బి డీన్‌కుమార్‌, కోకన్వీనర్‌ కె విజరుకుమార్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం మూడోరోజు ఉదయం విడతకు 50,978 మంది దరఖాస్తు చేయగా, 48,076 (94.3 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. 2,902 (5.7 శాతం) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని వివరించారు. మధ్యాహ్నం విడతకు 50,983 మంది దరఖాస్తు చేస్తే, 48,152 (94.4 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. 2,831 (5.6 శాతం) మంది గైర్హాజరయ్యారని తెలిపారు. గురువారం ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం రాతపరీక్షలను ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, జేఎన్టీయూ హైదరాబాద్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్‌ కె వెంకటేశ్వరరావు పర్యవేక్షించారని పేర్కొన్నారు. మూడోరోజు ఎప్‌సెట్‌ రాతపరీక్షలు ప్రశాంతంగా జరిగాయని వెల్లడించారు.

Spread the love