– రాధిక వేములను పరామర్శించిన జాతీయ స్త్రీవాద వేదిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో దళిత గుర్తింపును చెరిపేయటానికి కుట్ర జరుగుతున్నదని జాతీయ స్త్రీ వాద వేదిక (ఏఎల్ఐఎఫ్ఏ) ఆరోపించింది. దీన్ని సవాలు చేస్తూ మరో పోరాటాన్ని చేపట్టిన రోహిత్ వేముల తల్లి రాధికకు మద్దతునిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు గురువారం ఆమెను వేదిక నేతలు పరామర్శించారు. తెలంగాణ పోలీసులు ఫైల్ చేసిన ‘క్లోజర్ రిపోర్ట్’ తిరోగమన రిపోర్ట్ అని ఈ సందర్భంగా వారు విమర్శించారు. ఆ రిపోర్టు దళితుల అణచివేతకు మరోక వ్యక్తీకరణని పేర్కొన్నారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్, కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారితో సహా రోహిత్ ‘మరణానికి’ బాధ్యులైన వారిని కోర్టు ముందుకు ఈడ్చి, శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వాగ్దానం చేసినట్టు దళిత, ఆదివాసీ, ఓబీసీ, ఇతర మైనారిటీలు, జెండర్ మైనారిటీలకు చెందిన విద్యార్థులు, వివక్ష లేకుండా, స్వాభిమానంతో చదువుకోవటానికి రక్షణ కల్పించే రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.