ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు అరెస్టులు అప్రజాస్వామ్యం

నవతెలంగాణ – కంటేశ్వర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తుగా విద్యార్థి యువజన సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యం అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిటిఎఫ్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు శంతన్, జిల్లా అధ్యక్షులు బాలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజన్నలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పై మండిపడ్డారు.

 (4/6/3/2023)న ముఖ్యమంత్రి నిర్మల్ జిల్లా పర్యటన సందర్భంగా సరిహద్దు జిల్లా అయిన నిజామాబాద్ జిల్లాలో పలువురు విద్యార్థి, యువజన సంఘాల, ప్రజాసంఘాల, రాజకీయ పార్టీల నాయకులను అరెస్టు చేయడం అక్రమం. తక్షణమే  భేషరతుగా అరెస్టు చేసిన అందర్నీ పోలీసులు విడుదల చేయాలని, పోలీసు శాఖ ఉన్నత అధికారులకు డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎంతో ఘనమైన అభివృద్ధి సాధించామని ఈ దేశంలో  తెలంగాణ  రాష్ట్రం ఆదర్శవంతంగా నిలిచిందని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం అదే నిజమైతే రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అక్కున చేర్చుకునేవారు, అది జరగడం లేదు హక్కుల్ని సాధించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి అనేక రకాల ఉద్యమాలు ఇందిరా పార్క్ వద్ద, వివిధ జిల్లా కేంద్రాలలో నిరంతరం జరుగుతున్న ఉద్యమాలు ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తున్నది. ఈరోజు పోలీసు బందోబస్తు నడుమ ముందస్తు అరెస్టులు జరిపి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడo బట్టి చూస్తే ప్రభుత్వ పెద్దలు చెబుతున్న అభివృద్ధి ఏమాత్రం జరగలేదన్నది నగ్న సత్యం. ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ చోట నిర్వహించిన ముందస్తు అరెస్టులు చేయడం పోలీసు పడగనిడలో ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడం ద్వారానే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే నెరవేర్చినట్టు అబద్ధాలు చెబుతున్నారని అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. విద్య రంగంలో కామన్ స్కూల్ విధానం అమలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వ పాఠశాలలు సబ్జెక్టు టీచర్లు కొరతతో తొమ్మిదేళ్లుగా విద్య నానాటికి దిగజారుతోంది తెలంగాణ ఏర్పడ్డాక సొంతంగా ఒక్క డీఎస్సీ నిర్వహించని రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉపాధ్యాయ ఖాలీలను భర్తి చేయకపోవడం, కరోనా కంటే ముందు 25 వేల విద్యా వాలంటరీ పోస్టులు ఉంటే వాటిని రద్దు చేసి నేటికీ పునరుద్ధరించకపోవడం, తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత సుమారు 6 వేల పాఠశాలల మూసివేత వల్ల డ్రాపౌట్స్ పెరిగి  విద్యారంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ప్రతి ఉన్నత పాఠశాలలో సగం సబ్జెక్టు టీచర్లు కూడా లేని దుస్థితి, నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఊసే లేదు. దళితులకు మూడెకరాల భూమి, బడుగు బలహీన వర్గాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటింటికి మంచినీటి సరఫరా, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, గిరిజన ఆదివాసుల బిడ్డలకు పోడు భూములపై పట్టాలు, ధరణిలో లోపాలను సవరించకపోవడం వల్ల లక్షల రైతులు తమ భూములు తమరివిగా చెప్పుకోలేని పరిస్థితి, ప్రకృతి వైపరీత్యం వల్ల ఇటీవల పంట నష్టం పై ప్రకటించిన పదివేల రూపాయలు నేటికీ ఏ ఒక్క రైతుకు ఇవ్వకపోవడం, ధాన్యాన్ని కొనే దిక్కు లేక రోడ్లమీద ధాన్యాన్ని రైతులు పారపోసి నిరసన వ్యక్తం చేయడం,  రైతులకు గతంలో అందించే ఇన్పుట్ సబ్సిడీ , సబ్సిడీ ఎరువులు విత్తనాలు, గిట్టుబాటు ధర అందని పరిస్థితి, దీనికి తోడు పండించిన పంటను మార్కెట్లో స్వేచ్ఛగా అమ్ముకోలేని రైతులు గిట్టుబాటు ధర పొందక పంటలకు నీటి వసతి లేక చేసిన అప్పులను తీర్చలేక ఈ తొమ్మిదేళ్ల కాలంలో వేలాది మంది రైతులు ఆత్మ హత్యలకు పాల్పడడం, అర్హులైన లక్షలాది నిరుపేదలకు తొమ్మిదేళ్లుగా రేషన్ కార్డులు పంపిణీ చేయకపోవడం, వితంతు, వృద్ధాప్య, ఒంటరి మహిళలకు,  మొదలైన లక్షలాదిమంది పింఛన్లు కొరకు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.  పైన పేర్కొన్న ప్రధాన స్రవంతి సమస్యలలో ఏ ఒక్కటి పరిష్కరించక పోవడంతో తెలంగాణ  ప్రజానీకంలో వివిధ రూపాలలో తీవ్ర నిరసనలు అగ్ర ఆవేశాలు వ్యక్తమవుతున్న సందర్భాలు అనేకం.          కావున రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు హామీ పడిన వాటన్నిటిపై తక్షణమే ఉత్తర్వులు వెలువరించి ఎన్నికలకు ముందే హామీలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము అని తెలియజేశారు. లేని యెడల ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Spread the love