నవతెలంగాణ – చెన్నై: ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సెంథిల్ బాలాజీ ఇంట్లో సోదాలకు వెళ్లింది ఐటీ శాఖ. మంత్రితో పాటు ఆయనకు సంబంధం ఉన్న కాంట్రాక్టర్లు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. అయితే.. ఆయన సోదరుడి ఇంటి దగ్గర తనిఖీలకు వెళ్లగా.. అక్కడ ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. కారూర్ జిల్లాలోని మంత్రి బాలాజీ సోదరుడు అశోక్ ఇంటి వద్ద డీఎంకే కార్యకర్తలు భారీగా గుమిగూడారు. వాళ్లను దాటుకుని అధికారులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డీఎంకే నేతలు ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాడితో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు సోదాలు చేయకుండానే వెనుదిరిగారు. తనిఖీల బృందానికి ఓ మహిళా ఆఫీసర్ నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది.