తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చెలగాటాలు

BJP is in trouble in Telugu statesఉదర పోషణార్థం బహుకృత వేషధారణం అన్నట్టుగానే రాజకీయాధికారం ఆధిపత్యం కోసం కేంద్రంలోని బీజేపీ ఎన్‌డిఎ ప్రభుత్వ అధినేత మోడీ, ఆయన మద్దతుదారులు వేస్తున్న వేషాలు తెలుగు రాష్ట్రాల్లో రసవత్తర ఘట్టానికి తెరతీశాయి. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగోలా ప్రత్యక్ష పరోక్ష మద్దతు దారులను పెంచుకోవాలన్న బీజేపీ కూట మిలో ఇంతవరకూ ఒక్కరైనా చెప్పుకోదగిన భాగ స్వాములు చేరింది లేదు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో దాన్నే తిరగేసి చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్‌డిఎలో చేరతానన్నా, తాను నిరాకరించానని సెలవిచ్చారు. ఒకదశలో మోడీ విధానాలపై విరుచుకుపడిన కేసీఆర్‌ ఇటీవల మౌనం దాల్చడంతో బీజేపీ బీఆర్‌ఎస్‌లు మళ్లీ దగ్గరయ్యాయా? అనే సందే హాలు పెరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత గజిబిజికి కారణమైనాయి. మోడీ మాటలను మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించగా ఆ రెండు పార్టీలదీ ఫెవికాల్‌ బంధమని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిజానికి టీబీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ కె.లక్ష్మణ్‌ 2018లో స్వయంగా తమతో పొత్తు కోసం వచ్చారని కేటీఆర్‌ వెల్లడించారు. ఏది ఎంత నిజమైనా ఈ రెండూ బయటవారికి తెలియని విషయాలే. పార దర్శకత లేని పాలకపార్టీల వ్యూహాలు, అవకాశవాదాలు ఎలా వుంటాయో ఈ ఉదంతాలు వెల్లడి చేశాయి. మోడీ ఒకనాటి రహస్యాన్ని బయటపెట్టి కేసీఆర్‌ను ఇరకాటంలో నెట్టారని ఒక కథనమైతే కేవలం అభూత కల్పనలతో గందరగోళం కోసం విఫలయత్నం చేశారని మరో అభిప్రాయం వినిపిస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య లేదా ఎన్‌డిఎ ఇండియాల మధ్య సమదూరం పాటిస్తామని కేసీఆర్‌ చెప్పిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత దేశవ్యాపితంగా ప్రత్యా మ్నాయం తీసుకొస్తామని కూడా ఆయన అన్నారు. అయితే తాము ప్రస్తుతానికి మహారాష్ట్రలో మాత్రమే పోటీ చేస్తామని ఇటీవల కేటీఆర్‌ స్పష్టీకరించారు. బీఆర్‌ఎస్‌ నేస్తంగా వున్న మజ్లిస్‌ ఒవైసీ కూడా మూడో ఫ్రంట్‌ కేసీఆర్‌ నాయకత్వాన ఏర్పడాలని పిలుపు నిచ్చారు. ఇలాంటి తరుణంలో మోడీ మాటలు మరింత వేడిని పెంచాయి. ప్రస్తుతం ఛాతీలో సెకం డరీ ఇన్‌ఫెక్షన్‌తో అస్వస్థులుగా వున్న కెేసీఆర్‌ తర్వాత నైనా సమాధానం ఇస్తారేమో చూడ వలసి వుంటుంది. ఈ లోగా వచ్చిన ఎన్నికల సర్వేలు కాంగ్రెస్‌కు అను కూలంగా వుండగా బీజేపీ నేతలు మాత్రం తమకు అనుకూలంగా వుంటాయనీ హంగ్‌ సభలో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రక టించారు. బీజేపీకి సంబంధించిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా కొందరు ప్రధాని సభనే బహిష్క రించారు. దాంతో అలిగిన వారికి పదవులు ఇచ్చి మరీ నిలుపుకోవలసిన అగత్యమేర్పడింది.
తెలంగాణలో పరిణామాలు, మోడీ మాటలు
ఇంచుమించు ఈ కాలంలోనే చంద్రబాబు అరెస్టు జరగడంతో దానిపై ఐటిసిటీలో నిరసనలు వద్దని కేటీఆర్‌ స్పష్టంగా ప్రకటించారు. మరోవైపున ఆ పార్టీ మంత్రులూ ప్రముఖులే దానిపై విమర్శలు చేశారు. టీడీపీ అనుకూల ఓటర్లు ఆంధ్ర ప్రాంత ఓటర్ల కోసం ఇదంతా చేస్తున్నారనే భావన బల పడింది. బీజేపీ కూడా రకరకాలుగా స్పందించింది. ఎన్టీఆర్‌తో సహ సినిమా పరిశ్రమ స్పందన లేదనే మాటవచ్చినా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా సినిమా వారి సమస్యలు అర్థం చేసుకోవాలని వాదిం చారు. మరోవైపున గత రెండుసార్లు బరిలో దిగని జనసేన ఈసారి 32 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రక టించింది. తెలంగాణలో బీజేపీకి మద్దతునిస్తామనే ప్రతిపాదనతో ఏపీలో వారి అండదండలు పొందాలనే ఆలోచనతో టీడీపి తెచ్చిన ప్రతిపాదనను బీజేపీ తోసి పుచ్చింది. ఎన్‌డిఎలో భాగస్వామినంటూనే పవన్‌ కళ్యాణ్‌ 32 స్థానాల్లో పోటీ ప్రకటించినా వీరు స్పందించలేదు. ఒక విధంగా ఇది వ్యూహాత్మకమేనని, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లలో చీలిక తేవ డానికే ఇలా చేస్తున్నారని అనేకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో అనేక సమస్యలు అనైక్యతలు వున్నా బీఆర్‌ఎస్‌కు అదే ప్రధాన ప్రత్యర్థి అని కేసీఆర్‌ కూడా అంగీకరించి వున్నారు. అందువల్లనే బహుశా దానికి అవకాశం లేకుండా చేయడం కోసం మోడీ రంగంలోకి దిగారనుకోవాల్సి వుంటుంది. దక్షిణాదిన అసలే టికానా లేని బీజేపీ కాంగ్రెస్‌కు ఏ విధం గానూ అవకాశం ఇవ్వకూడ దనే గట్టి వైఖరితో వుంది.
ఏపిలో ఎన్ని మెలికలు?
చంద్రబాబు అరెస్టు కేంద్ర బీజేపీ అండ దండలు కనీసం ఆమోదం లేకుండా జరిగి వుండదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశంలోనూ చాలా మందిలో ఇదే భావం వుంది. అయినా సరే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, బాలకృష్ణ, అచ్చెం నాయుడు వంటివారు బీజేపీకి సంబంధం లేదని పదేపదే చెబుతున్నారు. ఆ బీజేపీ నేతలతో కలసి మాట్లాడితే ఏదో ఉపశమనం దొరుకుతుందని ఢిల్లీలో మకాం వేసినా ఒకరైనా కలుసుకోవడానికి సిద్ధం కాలేదు. అయినా సరే వారికి సంబంధం లేదని లోకేశ్‌ కితాబునిస్తూనే వున్నారు. పవన్‌కళ్యాణ్‌ మరింత గట్టిగా చెబుతున్నారు. ఏపీ బీజేపీ నాయకులు పరిపరి విధాల మాట మారుస్తున్నారు.అరెస్టు తర్వాత టీడీపీ తో పొత్తు వుంటుందని ప్రకటించిన పవన్‌కళ్యాణ్‌ తాను ఎన్‌డిఎ తోనే వున్నానని పునరుద్ఘాటించారు. సనాతన ధర్మం కాపాడాలని కూడా మరోసారి పిలుపునిచ్చారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ మోడీ సర్కారును పోటీపడి పొగుడుతూనే వున్నారు. కేంద్రంలో మోడీని రాష్ట్రంలో జగన్‌ను ఓడించడం కోసం టీడీపీ జన సేనలతో కలసి వెళ్తా మని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. బీజేపీ తో ప్రత్యక్ష, పరోక్ష అవగాహన అనుబంధం వున్న వారెవరితోనూ కలిసే అవకాశమే లేదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు ఆయా సంద ర్భాల్లో వెల్లడించారు. పవన్‌కు స్పష్టత లేకుండా పరి పరివిధాల మాట్లాడుతున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా విశాఖ పర్యటనలో వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి దూరం కావాలని తాము కోరుతున్నా మని రామకృష్ణ చెప్పారు గానీ ఆ పార్టీల కీలకనేతల మాటలు అందుకు పూర్తి విరుద్ధంగా వున్నాయి. ఈ సమయం లోనూ బీజేపీ మాత్రం తము జనసేనతోనే పొత్తులో వున్నామనీ, టీడీపీ సంగతి పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలని అంటూ వచ్చారు. మొన్న కోర్‌కమిటీ చర్చ లంటూ జరిపి అధిష్టానానికి నివేదిస్తామన్నారు. ఇక్కడ గమ నించాల్సిందేమంటే ఈ సమయంలోనే ముఖ్య మంత్రి జగన్‌ ఢిల్లీలో నెంబర్‌ టూ అమిత్‌షాను కలిసి మాట్లాడి వచ్చారు. ఆయన అక్కడ కలుస్తున్న రోజునే ఇక్కడ హైదరాబాద్‌లో బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా, మాజీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌లు అనుకూల పత్రికాధి పతులను ప్రత్యేకంగా కలుసుకోవడం చూశాం. జగన్‌ కుటుంబం సాక్షి పత్రిక యజమాని కూడానని గుర్తుంచుకోవాలి. ఢిల్లీలో న్యూస్‌ క్లిక్‌పై దారుణమైన దాడి చేస్తూ పత్రికాస్వాతంత్య్రం కాలరాస్తున్న బీజేపీ పెద్దలు ఇక్కడ మాత్రం ముఖ్యమైన మీడియాతో మంతనాలు జరుపుతున్నారు. ఆ ఘటనపై సంపాద కీయాలు రాస్తూ తెలుగు రాష్ట్రాలలో మీడియాపై దాడిని కూడా ప్రస్తావించిన ఆ రెండు పత్రికలు అదే ఆందోళన వారి ముందుగానీ తర్వాత గానీ వెలి బుచ్చిన దాఖలాలు లేవు. మీడియాను ‘మోడి’యాగా మార్చేస్తున్నారనే ఆరోపణల మధ్య ఏకకాలంలో పర స్పర విరుద్ధమైన వైసీపీ, టీడీపీ, జనసేన మూడిం టినీ లోబచ్చుకోవడమే గాక బీఆర్‌ఎస్‌పైనా ఒత్తిడి పెంచడం కుటిల నీతికి దర్పణం. తమలో తాము కలహించుకుంటూ రాష్ట్రానికి అన్యాయం చేసే ఈ పార్టీలు బీజేపీని మాత్రం ప్రశ్నించడం లేదు. పైపెచ్చు పరస్పర కలహాలతో జుట్టు దాని చేతులోనే పెడు తున్నారు. తొమ్మిదన్నరేేళ్లుగా పేరబెట్టిన కృష్ణా జలాల పంపిణీ సమస్యపై ఆదరాబాదరగా కొత్త ట్రిబ్యూనల్‌ ప్రకటించడం ద్వారా తెలంగాణ ఎన్నికల్లో అవకాశాలు పెంచుకోవాలన్న బీజేపీ తాపత్రయం స్పష్టమైంది. అయిదు రాష్ట్రాల మధ్య పున:పంపిణీ కాకుండా రెండు రాష్ట్రాల మధ్యనే విభజన, అది కూడా ఏకపక్షంగా నిర్ణయించిన షరతుల మీద జరగడం ఏపీకి ఆమోదయోగ్యం కాదు. తెలంగాణకూ బలమైన అభిప్రాయాలున్నాయి. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డుకు ఉమ్మడి ఏపీ కూడా అభ్యంత రాలు చెప్పి సవాలు చేసింది. ఇప్పుడు ఆ పరిధిలోనే పున:పంపిణీ ఎలా న్యాయమవుతుంది? ఈ విషయంలో కూడా ప్రాంతీయ పార్టీలు ఒకరినొకరు అను కోవడం తప్ప ఢిల్లీలోని మోడీ కౌటిల్యాన్ని ప్రశ్నిస్తున్నది లేదు. ఈ తరుణంలోనే మోడీకి అస్మదీయుడైన అదానీ మహాశ యుడు వచ్చి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కావడం, రేవులు సంస్థలు, విశాఖ భూములు ఆయనకు అప్ప గించేందుకు రంగం సిద్ధం కావడం యాదృచ్చికం కాదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని జిందాల్స్‌కు కట్టబెట్ట డానికి పన్నాగాలు పన్నుతూనే మరో వంక ఎంపి జీవిఎల్‌తో ప్రయివేటీకరణ నిల్చిపోయిందని చెప్పిం చడం బీజేపీకే చెల్లింది. ఈ అంశంలో ప్రభుత్వం, ప్రాంతీయ పార్టీలు పోరాడింది లేదు. ఇవన్నీ చాల నట్టు మత రాజకీయాలు కూడా తరచూ తలెత్తుతు న్నాయి. మత రాజకీయాలను ఎదుర్కొనే బదులు తాము మరింతగా మతోద్ధారకులమన్నట్టు వైసీపీ, టీడీపీ, జనసేన వ్యవహరిస్తున్నాయి.
కార్యాచరణే సమాధానం
అందుకే మోడీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు అన్నాయం చేయడమే గాక స్వంతంగా పునాది లేని చోట చెలగాట మాడగలుగుతున్నది. అన్నిచోట్ల ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నట్లు అర్థమవుతుంది. దీన్ని తరచూ అప్రకటిత ఎమర్జెన్సీ అంటు న్నారు కానీ దొడ్డిదోవన తెచ్చిన ఈ నియం తృత్వం అప్పటికంటే దారుణంగా తయారైంది. లౌకిక ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్యతత్వాన్ని కాలరాసే బీజేపీ రాజకీయ దాడులకూ, కుయుక్తులకూ తెలుగు రాష్ట్రాల పరిణామాలే అద్దం పడుతున్నాయి. ఈ దశలో పాలక పార్టీలు మనుగడ కోసం మోడీకి తలవంచుతున్న తీరు, పిల్లిమొగ్గలు వేస్తున్నవైనం అత్యంత నష్ట దాయకం. బడామీడియా మోడియాగా మారిపోవడం తో వాస్తవాలు పాక్షికంగానే అందుతున్నాయి. కేంద్ర రాష్ట్రాల హానికర విధానాలపై పోరాడవలసిన తరుణ మిది. ముందు తెలంగాణలోనూ తర్వాత ఏపీలోనూ ఎన్నికలు రాబోతున్నాయి గనక పొత్తుల ఎత్తులే ఇప్పుడు మొత్తం నిండిపోతున్నాయి, ఏ సర్వేలో నూ బీజేపీకి అనుకూలత లేకున్నా ప్రాంతీయ పార్టీల వూగిస లాటలూ అవకాశవాదాలే అంతిమంగా దానికి తాళాలు అప్పగిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. విజయవాడలో జరిగిన సమగ్రాభివృద్ధి చర్చ, విశాఖ ఉక్కు యాత్ర, తెలంగాణలో ప్రజాఉద్యమాల వంటి కార్యాచరణలే దానికి విరుగుడు. ప్రజల హక్కులనూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఐక్య పోరాటాలే ఇప్పుడు మార్గం చూపాలి. బీజేపీ వినాశక విధానాలతో చేతులు కలపని శక్తులను కూడగట్టాలి.
తెలకపల్లి రవి

Spread the love