రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ : ద్విచక్రవాహనాన్ని బస్‌ ఢీకొన్న సంఘటనలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. జగద్గిరిగుట్ట పోలీసుల వివరామేరకు .. గాజులరామారం డివిజన్‌ మహదేవపురంలో నివాసముండే రాములు కుమారుడు లక్ష్మణ్‌(19)బీటెక్‌ చదువుతున్నాడు. సమీపంలోని హోటల్‌లో టిఫిన్‌ తీసుకురావడానికి గురువారం ఉదయం స్కూటీపై ఇంటినుంచి బయలుదేరాడు. మల్లారెడ్డినగర్‌ సమీపంలో ఎదురుగా వచ్చిన ప్రైవేటు బస్‌ స్కూటీని ఢీకొంది. దీంతో కిందపడిన లక్ష్మణ్‌ తలపైనుంచి బస్‌టైర్లు వెళ్లడంతో తలకు తీవ్రగాయమై సంఘటనాస్థలంలోనే చనిపోయాడు. ఈమేరకు మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. లక్ష్మణ్‌ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Spread the love