న్యుమోనియా కేసుల తీవ్రతపై స్పందించిన చైనా

నవతెలంగాణ – హైదరాబాద్: చైనాలో గత కొన్ని రోజులుగా న్యుమోనియా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గతంలో కరోనా కూడా ఇలాగే చైనాలో బయటపడి ప్రపంచమంతా వ్యాపించిన నేపథ్యంలో, ప్రస్తుతం చైనాలో నెలకొన్న పరిస్థితులపై ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం దేశంలో మైక్రోప్లాస్మా కారక న్యుమోనియో చిన్నారుల్లో వ్యాపిస్తోందని వెల్లడించింది. అయితే, శీతాకాలం నేపథ్యంలో రానున్న రోజుల్లో న్యుమోనియాను మించి ఇతర శ్వాస సంబంధ వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని పేర్కొంది. అత్యధిక శాతం ప్రజలు ఈ జబ్బుల బారిన పడే అవకాశం ఉందని తెలిపింది. ఇటీవల నిర్వహిస్తున్న వైద్యపరీక్షలను పరిశీలిస్తే.. మైక్రోప్లాస్మా కంటే ఫ్లూ, అడినో వైరస్, ఇతర శ్వాస సంబంధ వ్యాధికారకాలు ఎక్కువగా నిర్ధారణ అవుతున్నాయని బీజింగ్ ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. అటు, తియాన్జిన్, షాంఘై ప్రాంతాల్లోనూ మైక్రోపాస్లా పాజిటివిటీ రేటు  తగ్గుముఖం పడుతోన్న దాఖలాలు కనిపిస్తున్నాయి.

Spread the love