బుల్లెట్‌ రైలులో ప్రయాణించిన సీఎం

నవతెలంగాణ వెబ్ డెస్క్: జపాన్‌ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఒసాకా నుంచి టోక్యోకు బుల్లెట్‌ రైలులో ప్రయాణం చేశారు. ‘‘ఒసాకా నుంచి టోక్యోకు బుల్లెట్‌ రైలులో ప్రయాణం చేశా. దాదాపు రెండున్నర గంటల లోపే 500 కి.మీల మేర ప్రయాణం సాగింది’’ అని పేర్కొంటూ తన జర్నీకి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. తమిళనాడుకు భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్‌కు వెళ్లిన స్టాలిన్‌.. ఆదివారం బుల్లెట్‌ రైలు ఎక్కారు. జపాన్‌లోని ఒసాకా నగరం నుంచి రాజధాని నగరం టోక్యో వరకు రైలులోనే ప్రయాణం చేసిన ఫొటోలను ఆయన షేర్‌ చేశారు.
వేగవంతమైన ఇలాంటి బుల్లెట్‌ రైలు సర్వీసులు భారతీయ పౌరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.  ఈ సందర్భంగా అక్కడి బుల్లెట్‌ రైలులో ప్రయాణం చేసిన ఆయన.. డిజైన్‌లోనే కాకుండా వేగం, నాణ్యతలోనూ బుల్లెట్‌ రైలుకు సమానమైన రైల్వే సేవలు మన దేశంలో రావాలన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటు వారి ప్రయాణాలు సులభతరం కావాలని ఆకాంక్షిస్తూ #futureindia అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అలాగే, జపాన్‌లో ఉన్న తమిళులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తమిళుల సంస్కృతిని చాటి చెప్పేలా అక్కడి చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయన్నారు.

Spread the love