వాహనదారులకు చల్లని కబురు… ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద

నవతెలంగాణ – హైదరాబాద్: రోజురోజుకూ ఉష్ణోగ్రతలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. పగటిపూట కాలు బయటపెడితే ‘వడ’లెత్తిపోవాల్సిందే..! కానీ, ఆఫీసులు, ఇతరత్రా అవసరాల కోసం బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. అలాంటి వారి కోసం పుదుచ్చేరి సర్కారు మంచి ఆలోచన చేసింది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఆగే వాహనదారులు ఎండలో ఇబ్బందిపడకుండా ఉండేందుకు గ్రీన్‌ నెట్స్‌తో పందిళ్ల మాదిరిగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రజా పనుల విభాగం ఆధ్వర్యంలో పుదుచ్చేరి వ్యాప్తంగా పలు సిగ్నళ్ల వద్ద కొంత దూరం వరకు ఈ గ్రీన్‌ షేడ్‌ నెట్స్‌ ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న వాహనదారులకు ఉపశమనం కలిగించేలా పుదుచ్చేరి అధికారులు చేసిన ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Spread the love