నవతెలంగాణ-నకిరేకల్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిన్నటి వరకు ఒకే గూటి పక్షులుగా ఉండి ఏ ఒక్కరోజు విమర్శలు చేసుకొని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ టికెట్ ప్రకటించగానే ఇద్దరు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇద్దరు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఏ సంక్షేమ పథకమైన బిఆర్ఎస్ కార్యకర్తలదే నన్నట్లు పాలన చేసి సామాన్యులకు ఎలాంటి లబ్ధి చేకూరకుండా రజాకార్లపాలనను తలపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కసితో పనిచేసి చిరుమర్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేపార్టీని వెర్రి వెంగళప్ప చేసి బీఆర్ఎస్ లో చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటినుండి నేటి వరకు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాయకత్వంలో పార్టీని పటిష్టం చేసినట్లు చెప్పారు.కాంగ్రెస్ పార్టీలో స్థానికంగా ఉండి ఆర్థిక స్తోమత కలిగి నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజాబలంతో గెలిచే సత్తా ఉన్న నాయకులు పార్టీలోను ఉన్నారని పేర్కొన్నారు. వీరి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని, మళ్లీ మోసపోయి మరో ఐదేళ్లు రోడ్డున పడే ఓపిక కార్యకర్తలకు లేదన్నారు. టీపీసీసీి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చే బీఫామ్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో నకిరేకల్ నియోజకవర్గ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ గార్లపాటి రవీందర్ రెడ్డి , మాజీ సర్పంచ్ సాయి రెడ్డి, నాయకులు షేక్ జానీ పాషా , పోతుల యాదగిరి, యం.డి రియాజ్ ఖాన్ , యం.డి యూసుఫ్ , అబ్దుల్ మజీద్ , చెనగోని రాజశేఖర్ గౌడ్ , వంటెపాక ప్రసాద్ , వంటెపాక సతీష్ , వంటెపాక నక్షత్ , నర్సింగ్ మహేష్ గౌడ్ , చెరుపల్లి సైదులు , పట్టేటి వెంకటేష్ , మధు , సాయి , జానీ , మహ్మద్ జావీద్ పాషా , ప్రభు కుమార్ , ముత్యాలు , పందిరి సతీష్ పాల్గొన్నారు.