జర్నలిస్టుపై మండిపడ్డ స్మృతి ఇరానీ… వీడియో షేర్ చేసిన కాంగ్రెస్

నవతెలంగాణ న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓ జర్నలిస్టుపై ఆమె మండిపడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అయ్యింది. దీన్ని తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన కాంగ్రెస్‌ కేంద్రమంత్రిపై విమర్శలు గుప్పించింది. మీడియాపై స్మృతి ఇరానీ బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. వివరాల్లోకి వెళ్లితే.. స్మృతి ఇరానీ యూపీ అమేఠీలో సొంత నియోజకవర్గమైన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను విలేకరులు చుట్టుముట్టి ప్రశ్నలు అడిగారు. అయితే, ఆ సమయంలో ఓ విలేకరిపై ఆమె మండిపడ్డారు. తన నియోజకవర్గ ప్రజలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ ప్రజలను అవమానిస్తేతాను ఊరుకోనని ఆమె అన్నారు. దీనికి ఆ విలేకరి బదులిస్తూ.. ‘‘నేను ఎవర్నీ కించపర్చట్లేదు. మీ చర్యల గురించి ప్రశ్నిస్తున్నాను అంతే. మీరు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా లేరు’’ అని అన్నాడు. దీనికి ఆగ్రహించిన స్మృతి.. ‘‘మరోసారి నా నియోజకవర్గ ప్రజలను అవమానిస్తే చూస్తూ ఉండను. మీకు ప్రజలను కించపర్చే హక్కు లేదు. మీరు పెద్ద రిపోర్టర్‌ కావొచ్చు. కానీ ఇంకోసారి ఇలా చేస్తే మీపై అధికారికి కాల్‌ చేయాల్సి ఉంటుంది. వాళ్లే అన్నీ చూసుకుంటారు జాగ్రత్త..!’’ అని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో  ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మీరు సమాధానాలు చెప్పగలిగే ప్రశ్నలే అడగాలా?: కాంగ్రెస్‌
ఈ వీడియోను కాంగ్రెస్‌  పోస్ట్ చేస్తూ.. ‘‘స్మృతి ఇరానీజీ విలేకరులను బెదిరిస్తున్నారు. వారి ఉద్యోగాలను ఊడగొట్టాలని చూస్తున్నారు. ఇక నుంచి జర్నలిస్టులు కేవలం చక్కెర రూ.13కు ఎప్పుడు వస్తుంది? గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎప్పుడు తగ్గుతుంది? అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలపై మౌనం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలే అడగాలేమో..! సమాధానం చెప్పలేని ప్రశ్నలడిగితే.. ఆమె కారు దిగి బెదిరిస్తారు. స్మృతిజీ మీరో విషయం అర్థం చేసుకోవాలి. ఇది ప్రేమ కాదు’’ అని కేంద్రమంత్రిపై విమర్శలు గుప్పించింది.
స్మృతి కౌంటర్‌..
కాంగ్రెస్‌ విమర్శలపై స్మృతి ఇరానీ స్పందించారు. ‘‘అమేఠీ ప్రజలతో తప్పుగా ప్రవర్తించొద్దనే నేను చెప్పాను. అది అభ్యర్థన అని మీకు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) అర్థం కాకపోవచ్చు. అమేఠీ ప్రజలను అవమానిస్తే మీరు భరించగలరేమో గానీ.. నేను కాదు. ఇక ప్రశ్నల గురించి అంటారా? చెప్పండి దీని గురించి మాజీ ఎంపీ (రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ)తో ఎప్పుడు డిబేట్‌కు దిగాలి. అప్పుడే చక్కెర, పిండి, పప్పుల ధరలు కూడా చెబుతాను’’ అని కేంద్రమంత్రి హస్తానికి కౌంటర్‌ ఇచ్చారు.

Spread the love