– పినరయి విజయన్, ఆయన కుమార్తెపై విచారణ జరపాలన్న పిటిషన్ తోసిపుచ్చిన విజిలెన్స్ కోర్టు
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్నాదన్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె టి.వీణలపై విచారణ జరపాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను విజిలెన్స్ కోర్టు తోసిపుచ్చింది. ఎగ్జాలాజిక్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి తాను చేసిన ఆరోపణలపై విజిలెన్స్ కోర్టు ప్రత్యక్ష విచారణ జరపాలని కుజల్నాదన్తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇందుకోసం పెద్ద ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా ఈ పిటిషన్ నమోదైంది. అయితే కోర్టు ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ కుజల్నాదన్ అవసరమైన సాక్ష్యాధారాలు అందచేయడంలో విఫలమయ్యారు. యుడిఎఫ్ అనుకూల మీడియా సాయంతో పదే పదే నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడానికి కుజల్నాదన్ ప్రయత్నించారు. కానీ విజిలెన్స్ కోర్టు తీర్పుతో ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రిపై, ఆయన కుమార్తెపై దాఖలైన పిటిషన్ను పరిశీలిస్తూ కోర్టు, సాక్ష్యాధారాలను సమర్పించాల్సిందిగా పిటిషనర్ను పలుసార్లు కోరింది. అయితే పిటిషన్ను పున: విచారణ చేయాలంటూ ఆయ కొత్తగా డిమాండ్ చేశారు. దాన్ని కూడా కోర్టు తిరస్కరిస్తూ, ఏ సాక్ష్యాధారాలు లేకుండా కోర్టుకు ఎలా వచ్చారని పిటిషనర్ను ప్రశ్నించింది. మైనింగ్ కంపెనీ సీఎంఆర్ఎల్ చేసిన అన్ని డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని కోర్టు తెలియచేసింది.