కాసేపట్లో మిజోరంలో కౌంటింగ్ ప్రారంభం

నవతెలంగాణ- హైదరాబాద్: కాసేపట్లో మిజోరంలో ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణతో పాటూ మిజోరంలో కూడా నిన్ననే కౌంటింగ్ జరగాల్సి ఉండగా ఈసీ కౌంటింగ్‌ను నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. క్రిస్టియన్లు మెజారిటీగా ఉన్న రాష్ట్రంలో ఆదివారానికి ఉన్న ప్రత్యేక దృష్ట్యా ఎన్నికల సంఘం కౌంటింగ్‌ను నేటికి వాయిదా వేసింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరంలో మేజిక్ ఫిగర్ 21. పద్ధెనిమిది మంది మహిళలు సహా మొత్తం 174 అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన మీజో నేషనల్ ఫ్రంట్ (ఎమ్ఎన్ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎమ్), కాంగ్రెస్ మొత్తం 40 సీట్లలోనూ తమ అభ్యర్థుల్ని నిలబెట్టాయి. బీజేపీ 13 సీట్లలో పోటీ చేస్తుండగా రాష్ట్రంలో తొలిసారిగా బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీపార్టీ 4 స్థానాల్లో తన అభ్యర్థుల్ని బరిలోకి దించింది. మరో 17 స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2018 నాటి ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామి ఎమ్ఎన్ఎఫ్ 26 సీట్లు గెలిచి కాంగ్రెస్ నుంచి అధికారం హస్తగతం చేసుకుంది. జెడ్‌జీఎప్ ఎనిమిది స్థానాల్లో జయకేతనం ఎగరవేయగా కాంగ్రెస్ కేవలం ఐదు సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. ఒక్క సీటు గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో బోణీ కొట్టింది. ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం, ఈసారి జెడ్‌పీఎమ్ 28-35 సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తుంది. ఎమ్ఎన్ఎఫ్‌కు 3-7 సీట్లు లభిస్తాయి. రాష్ట్రంలో ఒకప్పుడు ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఈసారి 2-4 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా. ఇక బీజేపీ కూడా గరిష్ఠంగా రెండు సీట్లతోనే సరిపెట్టుకోవాలని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి.

Spread the love