మల విసర్జనకు వెళ్లిన దళిత బాలిక.. సజీవ దహనం

నవతెలంగాణ – లక్నో: మల విసర్జన కోసం బయటకు వెళ్లిన దళిత బాలికకు నిప్పుపెట్టారు. దీంతో ఆ బాలిక సజీవ దహనమైంది. ఉత్తరప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హరయా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 13 ఏళ్ల దళిత బాలిక శుక్రవారం సాయంత్రం మల విసర్జన కోసం సమీపంలోని పొలాల వద్దకు వెళ్లింది. అయితే గంట వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బాలిక కోసం వెతకగా పొలాల్లో ఆమెకు నిప్పు పెట్టడంతో సజీవ దహనం కావడాన్ని చూసినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలిన బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

Spread the love