బీజేపీ ఓటమి ఖాయం

Defeat of BJP is certain– 2004 చరిత్ర పునరావృతం
– అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఇరవై ఏండ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి బీజేపీ ఓడిపోతుందనీ, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. 2004లో షైనింగ్‌ ఇండియా మ్యానిఫెస్టోతో పోటీకి దిగిన బీజేపీ…ఇప్పుడు (2024) వికసిత్‌ భారత్‌ పేరుతో అదే పాత ప్రయోగం చేస్తోందన్నారు. అప్పుడు వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ పాలనను సోనియాగాంధీ నేతృత్వంలో దేశ ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే పునరావృతమవు తుందన్నారు. అప్పటిలాగే వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీని తిరస్కరించి, రాహుల్‌గాంధీ నేతృత్వంలో దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడే తమ కష్టాలు తీరుతాయం టూ, అంబేద్కర్‌ కలలు నిజమవుతాయంటూ.. దేశ ప్రజలు ఎంతో ఆశగా చూస్తున్నారని తెలిపారు. ఈసారి బీజేపీ ప్రకటించిన మ్యాని ఫెస్టోలోని హామీలన్ని చెల్లని బ్యాంకు చెక్కులా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

Spread the love