తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం కేవలం భౌగోళిక స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన రాజకీయ పోరాటం మాత్రమే కాదు, అది నీళ్లు నిధులు నియామకాలు సామాజిక న్యాయం, ఆకాంక్షల సమాహారం. ఆ ఉద్యమానికి ప్రధాన శక్తిగా నిలిచింది విద్యార్థి–నిరుద్యోగ యువత. అయితే రాష్ట్ర ఏర్పాటై దశాబ్దం దాటిన ఈ సమయంలో కూడా నిరుద్యోగ సమస్య మరింత సంక్లిష్ట రూపం దాల్చడం ఆందోళనకర అంశంగా మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనాటి తెలంగాణ ఉద్యమ పరిస్థితులు, ఉద్యోగ నియామకాలలో జరిగిన ఆలస్యం, రాష్ట్ర విభజన అనంతర పరిపాలనా మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వయో సడలింపులు అమలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితిని 34 నుంచి 44 సంవత్సరాలకు పెంచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2024లో మరో రెండేండ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 46 ఏండ్లకు పెరిగింది. అయితే, ఆ జీవో గడువు 2026 ఫిబ్రవరి 8తో ముగిసింది. అయితే ప్రభుత్వం నిరుద్యోగులకు గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ఇంతవరకు కొత్త జీవో జారీ చేయలేదు.ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇరవై అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ ఉద్యోగాలకు విడుదల చేసిన నోటిఫికేషన్లో గతంలో అమలులో ఉన్న వయోపరిమితి సడలింపును కొనసాగించకపోవడం, ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం వలన నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
పాలకులు మారినా, నిరుద్యోగుల సమస్యకు స్థిరమైన పరిష్కారం మాత్రం కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ జాతీయ నాయక ుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్లో నిరుద్యోగులతో సమావేశమై “కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే యువత, నిరు ద్యోగుల బతుకులు మారతాయి” అని ప్రకటిం చారు. ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ను ప్రకటించారు. దానిలో అనేక హామీలు ఇచ్చారు నిరుద్యోగులకు నెలకు రూ.4వేల భృతి, రాజీవ్ యువ వికాస్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు, ప్రయివేటు రంగంలో తెలంగాణ యువతకు ప్రాధాన్యత వంటి ప్రధానమైన అనేక హామీలిచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు దాటుతున్నప్పటికీ ఆ హామీల అమలులో కనీస ఆచరణ కనబడటం లేదు ప్రత్యేకంగా ప్రస్తుత ప్రభుత్వం నిండు అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలులో స్పష్టత లేకపోవడం శోచనీయం. అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలు ఆచరణలో కనిపించకపోవడం వల్ల నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విశ్వసనీయత లేకుండా పోయింది ముఖ్యమంత్రి 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రకటిస్తున్నప్పటికీ, వాస్తవానికి ఈ ప్రభుత్వ హయాంలో కొత్తగా భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే.
మిగిలినవి గత ప్రభుత్వ కాలంలో విడుదలైన నోటిఫికేషన్లకు సంబంధిం చిన నియామక పత్రాలిచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలో సుమారుగా 40 లక్షల వరకు నిరుద్యోగులున్నారు. తెలంగాణలో నిరు ద్యోగం ఇప్పుడు ఒక సామాజిక–మానసిక సంక్షోభంగా మారుతోంది. సంవత్సరాల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతలో తీవ్ర నిరాశ పెరుగుతోంది. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన శాంత కుమారి కమిటీ నివేదిక ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవైపు ఖాళీలపై స్పష్టత లేకపోవడం, మరోవైపు నియామకాలలో ఆలస్యం- ఇవి యువత భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతున్నాయి. ఉద్యోగ నియా మకాలలో వివాస్పదమైన జీవో లున్నాయి వీటివలన గ్రామీణ వెనుకబడిన విద్యార్థులు తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారు వీటిని తక్షణం సవరించాలని నిరుద్యోగులు కోరుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను కేవలం పరిపాలనా అంశంగా కాకుండా, ఒక చారిత్రక–సామాజిక బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిని వెంటనే పదేళ్లకు పెంచాలి. ఖాళీ పోస్టులన్నింటికీ స్పష్టమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. సమయపాలనతో కూడిన నియామక ప్రక్రియను అమలు చేయడం, విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయడం, నిరుద్యోగ భృతి వంటి చర్యలు అత్యవసరంగా చేపట్టాలి.అప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం నిరుద్యోగుల విశ్వాసాన్ని పొందగలదు.
ఆర్.ఎల్. మూర్తి
8247672658



