తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్లు.. పోలీసులపై ఈసీ కొరడా

నవతెలంగాణ – తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. అప్పటి తిరుపతి నగర తూర్పు, పశ్చిమ సీఐలు శివప్రసాద్‌రెడ్డి , శివప్రసాద్‌పై వేటు వేసింది. తూర్పు పీఎస్‌ ఎస్సై జయస్వాములు, హెడ్‌కానిస్టేబుల్‌ ద్వారకానాథ్‌రెడ్డిని సస్పెండ్‌ చేసింది. అలిపిరి అప్పటి సీఐ దేవేంద్రకుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేసింది. ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును మూసివేయించారు.తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైసిపి 34 వేల దొంగ ఓట్ల ఎపిక్‌ కార్డులను ముద్రించి ఓట్లు వేయించుకున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు, ఎన్నికల అధికారుల ఫిర్యాదుల మేరకు పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. ఎపిక్‌ కార్డుల ఆధారాలు ఉన్నప్పటికీ సమగ్ర విచారణ చేపట్టకుండా కేసును మూసి వేసిన పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Spread the love