నవతెలంగాణ-సిర్పూర్ (టి)
మండలంలోని చింతకుంట ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థి ఎరగటి రవి జాతీయ ఆదాయ-ప్రతిభా ఆధారిత ఉపకార వేతన పథకం (ఎన్ఎంఎంఎస్)కు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి విద్యార్థిని ఘనంగా సన్మానించి అభినందించారు.
ఎన్ఎంఎంఎస్కు ఎంపికైన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్య పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం లభిస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించగలిగానని విద్యార్థి ఎరగటి రవి పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కటకం మధుకర్ మాట్లాడుతూ, విద్యార్థి సాధించిన విజయానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వాలు విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలాగే పాఠశాల విద్యార్థులు ఎరగటి రవిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఎన్ఎంఎంఎస్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఆర్పీ రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ఎరగటి రవిని అభినందించారు.


