బస్సుయాత్రలో అందరూ భాగస్వాములు కావాలి అనుబంధ సంఘాలతో

టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
టీడీపీ ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే బస్సుయాత్రలో అందరూ పాల్గొనాలని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. పార్టీ ప్రతిష్టకోసం కృషి చేయాలని కోరారు. సోమవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ అనుబంధ సంఘాల అధ్యక్షులు పూర్తి స్థాయిలో కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనుబంధ సంఘాలు పార్టీకి వెన్నెముక లాంటివనీ, అవి ఎంత బలంగా పనిచేస్తే పార్టీ అంత బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు. అనుబంధ సంఘాలు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేయాలని ఆయన కోరారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీవ్ర కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామ భూపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌, బీసీ సెల్‌ అధ్యక్షులు శ్రీపతి సతీష్‌, తెలుగు మహిళా అధ్యక్షురాలు షకీలారెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు పొగాకు జయరాం, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు పి. అశోక్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షులు పి. రవీందర్‌, ఎస్టీ సెల్‌ అధ్యక్షులు కె. గోపి, టీఎన్టీయూసీ అధ్యక్షులు ఎం.కె. బోస్‌, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు చంద్రహాస్‌, లీగల్‌ సెల్‌ అధ్యక్షులు రఘు వర్థన్‌ ప్రతాప్‌, గీత కార్మిక సంఘం అధ్యక్షులు గజేంద్రగౌడ్‌, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ముంజ వెంకటరాజం గౌడ్‌ పాల్గొన్నారు.
నేడు ట్రస్ట్‌భవన్‌కు చంద్రబాబు
టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబునాయుడు మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ తెలంగాణ శాఖ కార్యక్రమాల సమీక్ష, ఇతర అంతర్గత అంశాలపై చర్చించనున్నారని తెలిసింది. త్వరలో చేపట్టనున్న బస్సుయాత్రకు సంబంధించి కూడా మాట్లాడనున్నారు. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ ఏర్పాట్లు చేశారు.

Spread the love