నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు వానాకాలంలో ఎల్ నినొ ప్రభావం, వర్ష బావ పరిస్థితులపై ఆరుతడి పంటల సాగుపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి బి.రాజు మాట్లాడుతూ.. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం ఎల్ నీ నో ప్రభావం వలన జూన్, జూలై నెలలో సాదరణ వర్షపాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదైందని, వచ్చే ఆగస్టు నెలలో కూడా వర్షా బావ పరిస్థితులు ఉన్నందున రైతులు ఈ వానాకాలంలో బోరు బావులలో ఉన్న నీటి వసతిని బట్టి వరి సాగు, పంటల సాగు విస్తీర్ణం చేపట్టాలని అన్నారు. తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు పెసర, మినుము, మొక్కజొన్న, సజ్జ, వేరుశెనగ, చిరుధాన్యాలు, కూరగాయలు సాగు చేసుకోవాలని, సాగు నీటిని ఆదా చేసుకొని పంటలు పండించుకోవాలని సూచించారు.
ఉద్యాన శాఖ అధికారి రాజు మాట్లాడుతూ.. కూరగాయలు, ఆయిల్ ఫామ్ వంటి పంటలను తక్కువ నీటితో సాగు చేసుకోవచ్చని, ప్రభుత్వ ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, ఏఈఓ లు రాజేశ్వర్, షబ్బీర్, సాయిరాం రాజు, శివప్రసాద్, శుభస్య, పిఏసిసి సీఈవో కృష్ణ, ఫ్రీ యూనిక్ కంపెనీ అధికారులు, రైతులు పాల్గొన్నారు.



