రైతులు పార్లమెంట్ ముట్టడికి యత్నం.. ఢిల్లీలో ఉద్రిక్తత

నవతెలంగాణ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ (Delhi) శివార్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నోయిడా (Noida), గ్రేటర్‌ నోయిడా పరిధిలోని రైతులు (Farmers Protest) పార్లమెంట్‌ (Parliament) ముట్టడికి బయల్దేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి నగరంలోకి అనుమతిస్తున్నారు. ఈక్రమంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ (Traffic jam) ఏర్పడింది. వేలాది వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఊహించని పరిణామాలు ఎదురైతే ఎదుర్కొనేందుకు వీలుగా అల్లర్ల నియంత్రణ వాహనాలను, జల ఫిరంగులను పోలీసులు సిద్ధం చేసి ఉంచారు.
డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. రైతులు గుమిగూడకుండా వారిని అడ్డుకుంటున్నారు. ఢిల్లీలో ఇంత భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు సిద్ధమవడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. ఇంతకుముందు హరియాణా (Haryana), ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh), పంజాబ్‌ (Punjab) రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ శివార్లలో రోడ్లను దిగ్బంధించి నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ప్లాట్లుగా అభివృద్ధి చేస్తామని నమ్మించి తమ భూమిని స్థానిక ప్రభుత్వాలు దోచుకున్నాయని, తగినంత పరిహారం చెల్లించలేదని నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంత రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా వారంతా పార్లమెంట్‌ ముట్టడికి బయల్దేరారు.
సమాచారం అందుకున్న నోయిడా పోలీసులు.. ఢిల్లీలోకి ప్రవేశించకముందే వారిని అడ్డుకున్నారు. ఈ ఆందోళనల ముసుగులో కొన్ని సంఘ విద్రోహశక్తులు హింసకు పాల్పడే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని, వెంటనే అక్కడినుంచి వెళ్లిపోవాలని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మంగళవారం హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీకి ట్రాక్టర్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, రైతులకు పింఛను, పంటబీమా, 2020 ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో మునుపటి పరిస్థితులు పునరావృతం కాకుండా హరియాణా, పంజాబ్‌ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గత ఆందోళనల్లో క్రియాశీలంగా పని చేసినవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి.. రాజధానిలోకి రైతులు ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. అంతర్‌ రాష్ట్ర సరిహద్దుల్లో ఇసుకబస్తాలతో గోడలు, సిమెంట్‌ బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఆందోళనలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Spread the love