– 17న హర్యానాలో రైతుల నిరసన
చండీగఢ్ : దెబ్బతిన్న పంటలకు తగిన నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని సంయుక్త కిసాన్మోర్చ (ఎస్కేఎం) హర్యానా రాష్ట్ర శాఖ నిర్ణయించింది. సబ్-డివిజన్ స్థాయిలో ఈ నిరసన ప్రదర్శనలు చేపడతారు. ‘పంటల రిజిస్ట్రేషన్ను ప్రైవేటు బీమా కంపెనీలు అనుమతించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల మేర పంట నష్టానికి సంబంధించిన బీమా క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క మహేంద్రఘర్ జిల్లాలోనే 17 వేల మంది రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద నష్టపరిహారం కోసం గత కొన్ని నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇతర జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి’ అని ఆల్ ఇండియా కిసాన్సభ (ఏఐకేఎస్) సీనియర్ ఉపాధ్యక్షుడు ఇందర్జిత్ సింగ్ చెప్పారు. రైతులు తమ పంటలకు బీమా సౌకర్యం పొందేందుకు ప్రీమియంలు చెల్లించినప్పటికీ నష్టపరిహారం పొందలేకపోతున్నారని ఆయన తెలిపారు.
రోV్ాతక్లో శుక్రవారం జరిగిన ఎస్కేఎం సమావేశంలో ఆందోళన కార్యక్రమాన్ని ఖరారు చేశారు. పంటలకు కనీస మద్దతు ధర పొందడం, రుణాల నుండి రైతులకు విముక్తి కల్పించేందుకు ఒక విధానాన్ని రూపొందించడం వంటి వ్యవసాయ సంబంధమైన డిమాండ్ల సాధన కోసం వారు భవిష్యత్ కార్యాచరణను కూడా ఖరారు చేశారు.