ఖమ్మంలో బీఆర్ఎస్‌కు షాక్… రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

నవతెలంగాణ – ఖమ్మం: వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు ఫ్యాక్స్ చేశారు. అలాగే జిల్లా అధ్యక్షుడు తాతా మధుకు కూడా రాజీనామా లేఖను పంపించారు. రాములు నాయక్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ అయిన రాములు నాయక్‌కు కాకుండా మదన్ లాల్‌కు బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చింది. టిక్కెట్ రాకపోయినప్పటికీ బుజ్జగింపుల కారణంగా బీఆర్ఎస్‌లో ఉండిపోయారు. పార్టీలో తనకు ఇప్పటికీ ప్రాధాన్యత లేదని చెబుతూ ఆయన రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. రాములు నాయక్ పార్టీని వీడుతున్న విషయం తెలిసి ఎంపీ నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌లు రెండు రోజుల క్రితం ఖమ్మంలోని రాములు నాయక్ నివాసంలో ఆయనను కలిశారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తనకు గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడమే కాకుండా ఇప్పుడు నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వకపోవడం ఏమిటని ఆయన వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు.

Spread the love