నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. దీంతో నలుగురు మరణించారు. ముగ్గురు పిల్లలతో సహా మరో ఏడుగురు గల్లంతయ్యారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించగా, ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు గల్లంతయ్యారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నది. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి పొద్దుపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకి ఏర్పడిందని, శనివారం ఉదయం నుంచి ఓడీఆర్ఏఎఫ్ బృందాలు గల్లంతైనవారికోసం గాలిస్తున్నాయని జిల్లా కలెక్టర్ కార్తికేయ గోయల్ చెప్పారు. ప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. నలుగురు మృతిచెందడం పట్ల విచారం వ్యక్తంచేశారు. ఆయా కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. దీంతోపాటు రక్షించిన వారికి సరైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.