స్వేచ్ఛ పాక్షికమే..!

– 2022లోనూ భారత్‌లో అదే స్థితి
– యూఎస్‌ సంస్థ ‘ఫ్రీడమ్‌ హౌజ్‌’ నివేదిక
– మోడీ పాలనలో దేశ పరిస్థితులపై ఆందోళన
న్యూఢిల్లీ : మోడీ పాలనలో భారత్‌లో స్వేచ్ఛ అనే పదానికి స్థానం కనిపించడం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ అనేది అందని ద్రాక్షగా మారింది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు ఈ విషయాన్ని అనేక సార్లు వెల్లడించాయి. యూఎస్‌కు చెందిన ఫ్రీడమ్‌ హౌజ్‌ కూడా ఇప్పుడు ఇదే విషయాన్ని వెల్లడించింది. భారత్‌లో 2022లోనూ ‘పాక్షిక స్వేచ్ఛ’ స్థితి ఉన్నదని వివరించింది. కిందటేడాదితో పోల్చుకుంటే మొత్తం స్కోర్లలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. ‘ప్రపంచంలో స్వేచ్ఛ(ఫ్రీడమ్‌ ఇన్‌ ద వరల్డ్‌)’ పేరిట 2023 ఏడాదికి సంబంధించిన ఎడిషన్‌ను సదరు సంస్థ విడుదల చేసింది. కొన్ని అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు ఈ నివేదికలో ర్యాంకులు కేటాయించారు. కాగా, భారత్‌ వంద మార్కులకు గానూ 66 మార్కులను సాధించింది. ఎన్నికల ప్రక్రియ, రాజకీయ బహుళత్వం మరియు భాగస్వామ్యం, ప్రభుత్వ పనితీరు, భావప్రకటనా స్వేచ్ఛ మరియు నమ్మకం, సంఘ మరియు సంస్థాగత హక్కు లు, చట్ట పాలన, వ్యక్తిగత స్వయంప్రతిపత్తి మరియు హక్కులు వంటి అంశా లు ఇందులో ఉన్నాయి.
ముస్లింల రాజకీయ హక్కులకు ముప్పు
భారత ముస్లింల రాజకీయ హక్కులకు ముప్పు పొంచి ఉన్నదని నివేదిక పేర్కొన్నది. ఈ విష యంలో మోడీ సర్కారు పట్టు బట్టి మరీ తీసుకొచ్చిన వివాదా స్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ఉటంకించింది. జనాభాలోని అట్టడు గు వర్గాలు పూర్తి స్థాయి రాజకీయ ప్రాతినిథ్యానికి నోచు కోలేక అడ్డంకులను ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 545 ఎంపీ స్థానాలకు గానూ ముస్లింలు 27 మంది మాత్రమే విజయం సాధిం చారని పేర్కొన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 14.2 శాతం ఉన్న ముస్లిం జనాభాకు దక్కిన స్థానాలు ఐదు శాతం మాత్రమేనని వివరించింది. 2022 ముగింపు నాటికి బీజేపీ నుంచి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం గమనార్హం.
నిష్క్రియాత్మకంగా లోకాయుక్త
భారత్‌లో ప్రభుత్వ పని తీరుపైనా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. లోకాయుక్తలు ఉనికిలో ఉన్నప్పటికీ.. వాటి అసమర్థ సంస్థాగతీకరణను పేర్కొన్నది. ఇలాంటి సంస్థలు తమ పనులను నెమ్మదిగా చేస్తున్నాయని వివరిం చింది. 2022 అక్టోబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 29 రాష్ట్ర స్థాయి లోకాయుక్తలలో ఏడింటి వార్షిక నివేదికలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండటం గమనార్హం. ఇక ఆర్టీఐ కింద ప్రభుత్వ పని తీరుకు సంబంధించి దాఖలు చేసిన పలు దరఖాస్తులకు సమాధా నాలు లభించడం లేదు. ఇందుకు ఆర్టీఐ అధి కారులపైనా చర్యలు ఉండటం లేదు. ఆర్టీఐ తన ప్రభావాన్ని కోల్పో యిందని వివరించింది.
యూనివర్సిటీల్లో హింస.. ప్రొఫెసర్లపై దాడులు
పత్రికా స్వేచ్ఛ మాత్రమే కాదు.. కొన్నేండ్లుగా భారత్‌లో విద్యా స్వేచ్ఛ గణనీయంగా బలహీనపడిందని నివేదిక పేర్కొన్నది. యూనివర్సిటీ క్యాంపస్‌లలో హింస, ప్రొఫెసర్లపై దాడులు పెరిగాయని వివరించింది. ”బీజేపీ సర్కారు సున్నితమైన అంశాలుగా భావించే వాటిపై చర్చించొద్దనే ఒత్తిడిని విద్యావేత్తలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, పాకిస్థాన్‌తో భారత సంబంధాలు, భారత కాశ్మీర్‌లో పరిస్థితులకు సంబంధించి ఇందులో ఉన్నాయి” అని నివేదిక పేర్కొన్నది. కర్నాటకలో తీవ్ర చర్చకు దారి తీసిన హిజాబ్‌ అంశాన్ని కూడా లేవనెత్తింది.
ఎన్జీఓల లైసెన్సుల రద్దుపై ఆందోళన
2017 నుంచి 2021 మధ్య దేశంలో 6,677 ఎన్జీఓల విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) లైసెన్సుల రద్దుపై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, 2022లో కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని రెండు ఎన్జీఓలపై జరిపిన ఇలాంటి చర్యనూ ఉటంకించింది. మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్‌ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో చోటు చేసుకున్న హింసాత్మక నిరసనలు, ఢిల్లీ, గుజరాత్‌, యూపీ, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో అక్కడి బీజేపీ ప్రభుత్వాలు, పాలనా యంత్రాంగాలు ముస్లింల భవనాలను కూల్చివేసిన ఘటనల గురించి నివేదిక వివరించింది.

Spread the love