గాంధీజీ – టెక్నాలజీ

Gandhiji - Technologyఇదేమిటి… గాంధీజీ, టెక్నాలజీని ముడి వేస్తున్నారని చాలామందికి అనిపించవచ్చు. అయితే గత పదేళ్ళ కాలంలో మళ్ళీ గాంధీజీని సరికొత్తగా తెలుగు ప్రాంతాలు అవలోకించడానికి సిద్ధపడ్డాయి.
గాంధీజీ 155వ జయంతి సందర్భంగా ఇంతవరకు జాతిపిత గురించి గమనించని విషయాలు ఒకసారి చూద్దాం!
1951లో ఒక భారతీయ యువకుడు అమెరికాలో ఐన్‌స్టీన్‌ను కలిశారు. ఐన్‌స్టీన్‌, గాంధీలలో ఎవరో ఒకరిని ప్రపంచం ఎంచుకోవాల్సిన అగత్యం ఏర్పడిరదని వ్యాఖ్యానించారు. గాంధీజీని గౌరవించే ఎంతోమందిలో ఐన్‌స్టీన్‌ ఒకరు. ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు యువకుడైన రామమనోహర్‌ లోహియా ఇలా వివరించారు – ఆటం బాంబు, సత్యాగ్రహం – ఈ రెండిరటిలో ఒకదాన్ని ప్రపంచం ఎంచుకోవాల్సిన అగత్యం ఉందని!
1930 చారిత్రాత్మక దండి యాత్రలో పాల్గొనడానికి గాంధీజీ ఎంపిక చేసిన 78 మందిలో చిన్నవాడు – బాల్‌ కాలేల్కర్‌. అహమ్మదాబాదులో గుజరాత్‌ విద్యాపీఠ్‌ స్థాపించిన కాకా కాలేల్కర్‌ కుమారుడైన బాల్‌ కాలేల్కర్‌ గాంధీగారి సబర్మతీ ఆశ్రమంలో పెరిగినవాడు. 1941లో అమెరికాలోని మాసచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి (ఎంఐటి) నుంచి ఈ యువకుడు మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. మహాత్మాగాంధీ – ఎంఐటి అనే అంశం మీద అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌ రాస్‌ బెసెట్‌ (యూనిర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కారోలినా) మహాశయుని అభిప్రాయం ప్రకారం చురుకైన పిల్లలను ఎంఐటిలో చదవడానికి గాంధీజీ బాగా ప్రోత్సహించారు. బాల్‌ కాలేల్కర్‌ ఎంఐటిలో చదువు పూర్తి కాగానే అమెరికాలోనే తన మిత్రులకు ఈ యువకుడిని పరిచయం చేస్తూ గాంధీజీ ఉత్తరం రాశారు. ప్రొఫెసర్‌ బెసెట్‌ అధ్యయనం ప్రకారం దాదాపు 9 మంది గాంధీజీ ప్రోత్సాహం కారణంగా ఎంఐటిలో చదివారని, వారిలో నాథు పాండ్య ఒకరని అంటారు. స్వాతంత్య్రం వచ్చాక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజి (ఐఐటి) సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సర్కార్‌ కమిటీ బృందంలో ప్రధానవ్యక్తిగా నాథు పాండ్య సేవలందించారు. గాంధీజీ శాస్త్రసాంకేతిక రంగాలపట్ల చాలా ఆదర్శనీయమైన, వాస్తవికమైన దృక్పథం కలిగి ఉన్నాడని, ఈ దిశలో కృషి చేసిన ప్రొఫెసర్‌ రావ్‌ బెసెట్‌ పేర్కొన్నారు.
ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త మేరీక్యూరి గురించి మనకు తెలుసు. ఆమె కాకుండా ఆమె భర్త, కుమార్తె కూడా నోబెల్‌ బహుమతులు పొందిన ప్రతిభావంతులు. మరో కుమార్తె ఈవ్‌ క్యూరీ 1942 డిసెంబరులో హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ సిండికేట్‌ (న్యూయార్క్‌) జర్నలిస్టుగా గాంధీని ఢిల్లీలో ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆ మహిళా జర్నలిస్టు తన తల్లి గురించి తను రాసిన జీవితచరిత్ర పుస్తకాన్ని గాంధీజీకి బహూకరించింది. ఆ పుస్తకాన్ని ఆనందంగా ఆమూలాగ్రం చదివిన గాంధీజీ పారిస్‌ వెళ్ళి క్యూరి నివసించిన ఇల్లు సందర్శించాలని ఎంతో ఉద్వేగపడ్డారు. క్యూరి పడిన కష్టాలతో పోల్చినపుడు మన శాస్త్రవేత్తలు పడే ఇబ్బందులు లెక్కలోకి రావు అని గాంధీజీ అన్నారని డా|| పంకజ్‌ జోషి 2011లో రాసిన గాంధీ అనె విద్యాన్‌ అనే గుజరాతి గ్రంథంలో వివరిస్తారు. గాంధీ మహాశయుడు ఈవ్‌ క్యూరీ రాసిన పుస్తకాన్ని అనువదించమని తన మిత్రురాలు, వైద్యులు అయిన డాక్టర్‌ సుశీలా నయ్యర్‌ను చాలాసార్లు కోరారు.
దక్షిణాఫ్రికాలో బారిస్టర్‌గా ఉన్న గాంధీజీ – 1901లో కలకత్తా కాంగ్రెస్‌ సమావేశాలలో పాల్గొనడానికి ఆహ్వానించింది ఎవరో తెలుసా? పి.సి.రేగా ప్రఖ్యాతులయిన ప్రఫుల్ల చంద్ర రే! రసాయనశాస్త్రవేత్తగా ఎంతో ప్రఖ్యాతులయిన పి.సి.రే బెంగాల్‌ కెమికల్స్‌ అనే ఫార్మాసూటికల్‌ పరిశ్రమను కూడా స్థాపించిన గొప్ప దేశభక్తుడు. గాంధీకన్నా ఎనిమిదేళ్లు పెద్దవారైన పి.సి.రే మహాశయుడు గాంధీజీ నిరాడంబరమైన కృషిని గుర్తించి ఉత్తేజం పొందారు.
మన దేశానికి విజ్ఞాన శాస్త్రరంగంలో తొలి నోబెల్‌ బహుమతిని 1930లో గడిరచిన మహాశాస్త్రవేత్త సి.వి.రామన్‌ మహనీయుడు, తన భార్య లోకసుందరి అమ్మాళ్‌తో కలసి 1936లో సేవాగ్రామ్‌ ఆశ్రమం సందర్శించి కస్తూరిబా – గాంధీజీ దంపతులతో ముచ్చటించారు. గాంధీజీ అంటే ఉత్కృష్టమైన గౌరవంతో ఉండేవారు సి.వి.రామన్‌ అని జి. వెంకటరామన్‌ అనే శాస్త్రవేత్త ‘సి.వి.రామన్‌ ది స్పిరిట్‌ ఆఫ్‌ జయింట్‌’ అనే వ్యాసంలో పేర్కొంటారు. గాంధీజీ గతించిన తర్వాత 1948 ఫిబ్రవరి 7న సి.వి.రామన్‌ ఆకాశవాణిలో ప్రసంగిస్తూ ఇలా అన్నారు – ”… భారత స్వాతంత్య్రోద్యమంలో నేను క్రియాశీలక పాత్ర ధరించలేదు. అంతేకాదు, ఆనాటి నాయకులతో పరిచయం కూడా పెంచుకోలేదు. అయితే గాంధీజీ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. వారితో కలసిన, మాట్లాడిన, విన్న ప్రతి సందర్భం నా మనస్సులో భద్రంగా గుర్తుండిపోయింది”. రామన్‌ మహాశయుడు ప్రతియేటా గాంధీ స్మారక ప్రసంగాన్ని తన రామన్‌ రీసర్చి ఇన్‌స్టిట్యూట్‌ (బెంగుళూరు)లో 1970లో వారు గతించేదాకా నిర్వహించారు. ఒక్క సంవత్సరం కూడా ఆగకపోవడం విశేషం.
– – –
ఇలాంటి విషయాలు తరచి చూస్తే గాంధీజీ జీవితంలో సైన్స్‌ పార్శ్వపు సంగతులు బోలెడు కనబడతాయి. కేవలం రెండు దశాబ్దాలుగా ఈ దిశలో గొప్ప పరిశోధన ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. అంతవరకు సుమారు ఐదు దశాబ్దాల కాలం శాస్త్ర సాంకేతిక రంగాలకు గాంధీ వ్యతిరేకం అనే ప్రచారం బాగా జరిగింది. గాంధీజీ కనుమూసినపుడు ‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో 1948 ఫిబ్రవరిలో ధారావాహికగా రాసిన పది సంపాదకీయాలలో ఒకటి అయిన గాంధీజీ మహాస్వప్నంలో ‘ఆయన సిద్ధాంతాల ప్రకారం యంత్రాలు తగవు’ అని నార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇటువంటి అభిప్రాయాలు తెలుగుతోపాటు చాలా భాషలలో అలాగే సాగాయి. ధనుంజయ కీర్‌ 1973లో రచించిన ‘మహాత్మాగాంధీ : పొలిటికల్‌ సెయింట్‌ అండ్‌ అన్‌ఆర్మ్‌డ్‌ ప్రొఫెట్‌’ అనే గ్రంథాన్ని సమీక్షిస్తూ నార్ల వెంకటేశ్వరరావు ఇలా అన్నారు ”… గాంధీజీ ప్రపంచ పురుషులలో ఒకడైనా, ఆయన హేతువాది కాదు. సైన్స్‌ను ఆయన నిరసించారు. ఆధునికతనే నిరసించారు. మతానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. అందువల్ల ఇతర హేతువాదుల వలే కీర్‌ కూడా గాంధీజీ ప్రతివాక్కును, ప్రతిచర్యను హర్షించలేదు. సమర్థించలేదు…” నార్ల రాసిన ఈ సమీక్షను 1976లో వెలువడిన ‘కదంబం’ గ్రంథంలో ఆసక్తి ఉన్నవారు చదువుకోవచ్చు.
సరే, ఇంకో విషయం చూద్దాం. 1969లో గాంధీ శతజయంతి సంవత్సర ప్రచురణగా బి.కె.ఆహ్లువాలియా సంపాదకత్వంలో ఫాసెట్స్‌ ఆఫ్‌ గాంధీ అనే సంకలనం వెలువడిరది. సర్వేపల్లి రాధాకృష్ణ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, వి.వి.గిరి మొదలైన 24 మంది మహామహులు గాంధీజీ జీవితం ఆలోచనలు గురించి రాసిన విశ్లేషణలు ఇందులో ఉన్నాయి. ఈ సంకలనం అన్ని భారతీయ భాషలలోకి అనువదించబడిరది. తెలుగులో పాలగుమ్మి పద్మరాజు, పిలకా గణపతిశాస్త్రి, విద్వాన్‌ విశ్వం, బాలాంత్రపు నళినీకాంతరావు, బి.వి.సింగరాచార్య తెనుగు చేసిన గాంధీదర్శనం సెప్టెంబరు 1969లో ఎస్‌.ఎల్‌.బి.టి ద్వారా ఎం.శేషాచలం అండ్‌ కో వారు ప్రచురించారు. ఈ ప్రచురణకు ముందుమాట రాసినవారు కాకా కలేల్కర్‌ (అవును, ఈయన ఈ వ్యాసం ప్రారంభంలో పేర్కొన్న బాల్‌ కాలేల్కర్‌ తండ్రి).
మంచి ఉపోద్ఘాతంలా కనబడే 18 పేజీల వ్యాసం రాసిన డా. ఎస్‌. రాధాకృష్ణన్‌ గారు అందులో ఇలా రాశారు. (అనువాదం : బి.వి.సింగరాచార్య)
”గాంధీజీ యంత్రాలను నిరాకరించలేదు. ఆయన అన్నది ఇది : ‘నా శరీరమే అతి సూక్ష్మాంశాలతో సంకీర్ణమైన యంత్రమని నాకు తెలిసినప్పుడు, నేను యంత్రాలకు వ్యతిరేకిని ఎలా అవుతాను? చరఖా అనేది యంత్రం. పళ్ళు కుట్టుకునే పుల్ల యంత్రం, యంత్రాలను గురించిన వ్యామోహానికి మాత్రం వ్యతిరేకినే, కేవలం యంత్రాలకు కాదు, శరీరపరిశ్రమను తగ్గించే యంత్రాలనబడే వాటిని గురించిన వ్యామోహం నేడు ఎక్కువగా కన్పిస్తూంది. వేలాదిమందికి పనులు లేకుండా పోయేవరకూ ఈ విధంగా మనం పనిని తగ్గించేసాం. వాళ్ళంతా సోమరులుగా వీధులలో తిరుగుతూ ఆకలితో మరణిస్తారు. మానవులలో ఎవరో కొంతమందికి మాత్రం పని, కాలం పొదుపు చేయటం నాకు సమ్మతం కాదు. ఈ పొదుపు మానవజాతి అంతటికి లభించాలి. ఐశ్వర్యమంతా ఎవరో కొందరి చేతులలో పేరుకొని ఉండటం కాదు, అందరికి పంపకం కావాలని నా అభిమతం. నేడు ఎవరో కొద్దిమంది లక్షలాది ప్రజానీకం మూపులపైన ఊరేగటానికి మాత్రమే యంత్రాలు ఉపయోగపడుతున్నాయి. దీని అంతరంగ ప్రేరణ శ్రమను పొదుపు చేయాలనే ఔదార్యం కానేకాదు, కేవలం పేరాశ. ఈ విధమైన పరిస్థితిని నేను నా సర్వశక్తులలో ప్రతిఘటిస్తాను. యంత్రం మానవుని కర్మేంద్రియాలను స్తబ్దం చేయకూడదు. పెద్ద పెద్ద కర్మాగారాలలో విద్యుచ్ఛక్తితో పనిచేసే యంత్రాలన్నిటినీ జాతీయం చేసి, ప్రభుత్వ యాజమాన్యం కింద నడపాలి. అన్నింటికన్నా ప్రధానమైనది మానవశ్రేయస్సు.”
ఈ మాటలు గాంధీజీ చెప్పారని డా. సర్వేపల్లి వారు పేర్కొన్నారు. నిజానికి ఇది గాంధీజీ యంత్రాల గురించి చెప్పినది విజ్ఞాన శాస్త్రాంశమే కాదు, ఆర్థిక ప్రణాళిక కూడా! యంత్రాలతో ఏమి జరుగుతుందో, ఏమి జరుగకూడదో గాంధీజీకి విస్పష్టమైన అభిప్రాయం ఉంది. ఇందులో ఏమాత్రం అస్పష్టత లేదు. ఇప్పుడు మనకు స్ఫురించే ప్రశ్న ఏమిటంటే – నార్ల వెంకటేశ్వరరావు వంటి దార్శనిక సంపాదకుడు ఈ శతజయంతి ప్రచురణ చూడలేదా లేక రాధాకృష్ణన్‌ గారి వ్యాసం చదవలేదా అనే ప్రశ్నలు స్ఫురిస్తున్నాయి. ఇదెలా జరిగింది? ఎందుకు జరిగింది? గాంధీ దర్శనం సంకలనంలోనే శాస్త్రవేత్త యు.ఆర్‌.రావు ఒక వ్యాసం రాశారు. గాంధీ యంత్రాల గురించి ఏమన్నారని చాలా సుతారంగా స్పృశించి వదిలివేశారు. మరెవరూ గాంధీజీ సైన్స్‌ దృష్టి, సైన్స్‌ ఆసక్తి గురించి రాయలేదు. అంతేకాదు ఆర్థిక శాస్త్రం, విద్య, మహిళలు వంటి విషయాల గురించి, గాంధీజీ ఆలోచనలు గురించి ఈ సంకలనంలో ఎవరూ రాయలేదు. ఇదెలా జరిగిందో కానీ గాంధీజీ మాత్రం యంత్రాలకు, విజ్ఞానానికి, ఆధునికతకు వ్యతిరేకి అనే ప్రచారం బాగా సాగింది. ఇప్పుడూ సాగుతోంది.
గాంధీజీ ఖాదీ ఉద్యమాన్ని సైన్స్‌ వ్యతిరేకమని ముద్రవేయడం ఆల్డస్‌ హక్స్లీతో మొదలైందని చేబ్రోలు శంభుప్రసాద్‌ ‘టువర్డ్స్‌ యాన్‌ అండర్‌స్టాండింగ్‌ ఆఫ్‌ గాంధీస్‌ వ్యూస్‌ ఆన్‌ సైన్స్‌’ అనే పరిశోధనాత్మక వ్యాసం (ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ, 29 సెప్టెంబరు 2001)లో వివరిస్తారు. గాంధీ ఎంత మాత్రం యాంటీ సైన్స్‌ కాదనీ, పౌరసమాజంలో ప్రత్యామ్నాయ సైన్స్‌కు అవకాశం వుండాలనీ, అభౌతికమైన వనరులను సైన్స్‌ వ్యవస్థలో ఎలా వినియోగించాలనీ, సత్యాగ్రహి శాస్త్రవేత్త గురించీ, ఈ దృష్టిలో మనిషి – ప్రకృతి మధ్య సంబంధం మొదలైన వాటి గురించి గాంధీజీ ఆలోచనలు ఏమిటో కూడా ఈ సమీక్షాత్మాక వ్యాసంలో చర్చించారు. సైన్స్‌ సంబంధించిన గాంధీజీ ఆలోచనలను ఇంతవరకు ఎవరూ లోతుగా పట్టించుకోలేదు అని కూడా డా.శంభుప్రసాద్‌ వివరిస్తున్నారు. 1988లో నెహ్రూ మ్యూజియం అండ్‌ మెమోరియల్‌ లైబ్రరీవారు వెలువరించిన నెహ్రూ ఆన్‌ సైన్స్‌ అండ్‌ సొసైటీ (సంపాదకులు-బి.సింగ్‌) గ్రంథంలో నెహ్రూ ఇలా అన్నట్లు పేర్కొంటున్నారు.“It (Gandhi’s) may not be a correct attitude: its logic may be faulty…… Even this attitude is not necessarily accepted by the political associates and followers of Gandhi. Personally I dond’t agree with it and I should make it clear that the Indian Congress and the national movement have not adopted it.
I have mentioned these considerations to you not to defend the spinning wheel but so that you may realise that Indian Nationalism is not opposed to big scale machinery and much less to science. I have no doubt that when it is in a position to do so, it will industrialise the country as rapidly as possible. My whole outlook on life and its problems is a scientific and I have never felt attracted towards religion and its methods
… Nehru while seeking to explain Gandhi’s attitude to sceience actually ends up furthering the divide between the so-called personal view of Gandhi and the public view of the Congress. His view shared by a large section of the Indian intelligentsia even today acknowledges Gandhi’s ability merely to mobilise people and rally them around the call for freedom. The Charkha is consequently important for its immediate economic and instrumental value in achieving freedom, to be discarded later. Nehru makes a clear divide between himself as a science person and Gandhi as a religious man…
శంభుప్రసాద్‌ గారు చక్కగానే జరిగిందేమిటో చెప్పారు. కాంగ్రెస్‌ వాదులమనుకునే వారు ఎక్కువమంది అధికారంవైపు నిలబడిపోయారు. గాంధేయవాదులనుకునేవారు కేవలం ఆచారపరాయణులుగా మిగిలిపోయారు. ఈ గాంధేయవాదులు గాంధీజీ ఆలోచనలను పరిశీలించాలని తలంచలేదు. అలా రెండు మూడుతరాలు గడిచిపోయాయి.
ముప్పయి, నలభయ్యేళ్ళ క్రితం గాంధీజీని సవ్యంగా చూడాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. అటెన్‌బరో నిర్మించిన గాంధీ సినిమా కూడా ఇక్కడ ఒక మలుపుగా పరిగణించాలి. ఏ.కె.బిస్వాస్‌, ఎం.మెక్లోర్‌ (వీ.వీవషశ్రీబతీవ), జె.పి.యస్‌.ఉబరారు, ఎస్‌.విశ్వనాథ్‌, ఎస్‌.సహస్రబుద్ధే వంటి వారు 1985-2000 మధ్యకాలంలో గట్టి కృషి చేశారు. వీరి ప్రయత్నాలను విహంగ వీక్షణంగా శంభుప్రసాద్‌ తన వ్యాసంలో పేర్కొన్నారు. గాంధీజీని విబేధించేవారంతా 1909లో గాంధీజీ రచించిన హింద్‌ స్వరాజ్‌ ను ఆధారంగా తీసుకుంటారు. అనుభవంతో, పరిజ్ఞానంతో తన అభిప్రాయాలు మెరుగుపరుచుకునే గాంధీజీని పూర్తి అర్థం చేసుకోవాలంటే 1948లో గాంధీజీ గతించేదాకా చేసిన మొత్తం రచనలను అధ్యయనం చేయాలి. సుధీంద్ర కులకర్ణి ఈ విషయం గురించి ఇలా వ్యాఖ్యానిస్తారు. ”… ష్ట్రఱర షతీఱ్‌ఱఅస్త్రర సవఎaఅస a్‌్‌వఅ్‌ఱఙవ ర్‌బసy, రబజూవతీళషఱaశ్రీఱ్‌y bతీవవసర ర్‌బజూఱసఱ్‌yౌౌ” (మ్యూజిక్‌ ఆఫ్‌ ది స్పిన్నింగ్‌ వీల్‌).
శాంతి ప్రవక్తగా గాంధీజీ సేవలను గౌరవిస్తూ ఐక్యరాజ్యసమితి 2007 నుంచి అక్టోబరు 2వ తేదీని ప్రపంచ అహింసా దినోత్సవంగా గుర్తించింది. ఇటువంటి సంఘటనల ద్వారా గాంధీజీని సరికొత్తగా పరిశీలించడం కూడా మొదలైంది. శాస్త్రవేత్త ఆర్‌(రఘునాథ్‌) ఎ. మాషెల్కర్‌ చేసిన కృషి విభిన్నమైంది, ప్రభావవంతమైంది. ఆయన చమత్కారంగా, అర్థవంతంగా ఉండే క్యాచీ స్లోగన్స్‌ ఇవ్వడంలో సిద్ధహస్తులు. పబ్లిష్‌ అండ్‌ పెరిష్‌, పేటెంట్‌ అండ్‌ ప్రాస్పర్‌ అని మేధోహక్కులు గురించి అర్థవంతంగా చెప్పారు. ఇతను ప్రతిపాదించిందే మోర్‌ ఫ్రమ్‌ లెస్‌ ఫర్‌ మోర్‌ (ఎంఎల్‌ఎం) భావన. పరిమిత వనరులతో ఎక్కువ ఫలితాలు సాధించి ఎక్కువమంది దోహదపడటం ఈ భావన. 2008లో ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తల బృందానికి ప్రసంగమిస్తూ ఈ నియమాన్ని ప్రతిపాదించారు. అదే గాంధేయ సాంకేతిక విజ్ఞానం లేదా గాంధియన్‌ ఇంజనీరింగ్‌. సి.కె.ప్రహ్లాద్‌తో కలసి 2010 జులై-ఆగస్టులో హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ జర్నల్‌కు ఈ విషయంపై పరిశోధనా పత్రం రాశారు ఆర్‌.ఏ.మాషేల్కర్‌. తర్వాత వేర్వేరు వేదికల మీద దీని గురించి చర్చించారు. (మీరు కూడా నెట్‌లో కొంత శోధిస్తే చాలా విషయాలు తారసపడతాయి.)
మాషేల్కర్‌ ప్రతిపాదించిన భావన ఒక గొప్ప పుస్తకం రావడానికి దోహదపడిరది. అదే సుధీంద్ర కులకర్ణి రచించిన మ్యూజిక్‌ ఆఫ్‌ ది స్పిన్నింగ్‌ వీల్‌. బొంబాయిలో 2010 ఏప్రిల్‌లో సుధీంద్ర కులకర్ణి ఒక సమావేశం ఏర్పరచి మాషేల్కర్‌ ప్రసంగం ఇప్పించారు – ఇదే అంశం మీద.
మహాత్మాగాంధీ ఎంతో మంది శాస్త్రవేత్తలను ఎంతగానో ప్రభావితం చేశారు. అలాగే గాంధీజీ పూర్తిగా వ్యవసాయదేశంగా కొనసాగాలనే భావనను మోక్షగుండం విశ్వేశ్వరయ్య వ్యతిరేకించారు. మేఘనాథ్‌ సాహ వంటి తర్వాతితరం శాస్త్రవేత్తలు సైన్స్‌ పాలసీ విషయంలో గాంధీజీని సరిగా అర్థం చేసుకోలేదు. ఐన్‌స్టీన్‌ కూడా సైన్స్‌ ఆఫ్‌ పీస్‌ విషయంలో అపార్థం చేసుకున్నారు.
1934 గాంధీజీ కోరికపై ఆల్‌ ఇండియా విలేజి ఇండిస్టీస్‌ అసోసియేషన్‌ను కాంగ్రెస్‌ ఏర్పరచింది. వార్థాలో ఏర్పడిన ఈ సంస్థకు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న ఆర్థిక శాస్త్రవేత్త జె.సి.కుమారప్పతోపాటు అప్పటి భారతదేశపు అగ్ర శాస్త్రవేత్తలు సి.వి.రామన్‌, జగదీశ్‌ చంద్రబోస్‌, పి.సి.రే సభ్యులు. 1938లో ఈ సంస్థ ఆధ్వర్యంలో ఖాదీ, రూరల్‌ టెక్నాలజీల గురించి మగన్‌లాల్‌ గాంధీ గుర్తుగా మగన్‌ సంగ్రహాలయాన్ని ఏర్పరిచారు. గాంధీ కాగితం తయారి గురించి, బెల్లం, కండసారి, ఎరువులు, ధాన్యం, పాడి, తేనెటీగల పెంపకం వంటి అంశాల గురించి చాలా రాశారు. గాంధీజీ విజ్ఞానం గురించి మాట్లాడినా, ఆర్థిక శాస్త్రం గురించి మాట్లాడినా వాటి పరమలక్ష్యం – సకల మానవాళి శ్రేయస్సు మాత్రమే. శంభుప్రసాద్‌ తన పరిశోధనా పత్రంలో ఒక ఆసక్తికరమైన, సిగ్గుపడాల్సిన విషయం రాశారు. ముతక బియ్యం, నాణ్యమైన బియ్యం, బెల్లం, చక్కెర వంటి ఆహారపదార్థాల రసాయన విశ్లేషణ చేసి తనకు అవగాహన కల్గించమని గాంధీ పేరు మోసిన వైద్యులకు, రసాయన శాస్త్రవేత్తలకు ప్రశ్నావళి పంపారు. ఏ ఒక్కరూ తన ప్రశ్నలకు జవాబు పంపలేదంటూ గాంధీజీ – వారి దృష్టిలో గ్రామీణుడు లేకపోవడమే కారణమని పేర్కొంటారు. ఇక్కడ సైన్స్‌, ఎకనామిక్స్‌, సగటు గ్రామీణుడికి తోడ్పడాలని ఆయన ఉద్దేశ్యం. అలాగే విజ్ఞాన ప్రగతి అనేది ప్రపంచ శాంతికి, నైతిక పురోగమనానికి దారి తీయాలని బలంగా విశ్వసించారు.
1918లో ‘బెరి బెరి’ వ్యాధి ప్రబలినప్పుడు తమిళనాడు ప్రాంతం కూనూరులోని పాశ్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక గదిగా మొదలైనది 1928లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌గా వృద్ధిచెంది, 1958లో హైదరాబాదుకు వచ్చింది. ఈ సంస్థ తొలిదశలో వ్యవస్థాపకులు రాబర్ట్‌ మాక్‌ కారిసన్‌ పారిశుధ్య, ప్రజారోగ్యం, పోషకాహారం మొదలైన విషయాలలో గాంధీజీ సలహాలను క్రమం తప్పకుండా లోతుగా చర్చించి స్వీకరించేవారు.
గాంధీజీ ప్రోద్బలంలో ఎం.ఐ.టి.లో తొమ్మిదిమంది చదువుకున్నారు కదా! 1925 ఫిబ్రవరి 16న దేవ్‌ చంద్‌ పారేఖ్‌ కుమార్తె చంపాబెన్‌కూ, టి.ఎం.షా కు వివాహమైంది. వధువు తండ్రి గుజరాత్‌ విద్యాపీఠ్‌లో రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. ఈ పెళ్ళికి గాంధీజీ వచ్చారు. 1927లో టి.ఎం.షా అమెరికాలో ఎం.ఐ.టి.లో చేరారు. 1930లో ఎలెక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. మరి అదే టి.ఎం.షా తన మరో సహాధ్యాయితో కలసి 1932లో జాతీయోద్యమంలో భాగంగా కారాగారం పాలయ్యారు. దేవ్‌ చంద్‌ పారేఖ్‌, హీరాలాల్‌ షా వంటి వారు బ్రిటీషువారి వస్త్రాలు అమ్మే బదులు స్వదేశీ బట్టలు అమ్మడం మొదలు పెట్టారు. అది గాంధీజీ ప్రభావం! 1963లో సబర్మతి ఆశ్రమం దగ్గరలో గాంధీ స్మారక మ్యూజియం ప్రారంభించారు. దీనిని రూపొందించిన ఆర్కిటెక్టు ఛార్లెస్‌ కోరియా ఎంఐటిలో చదువుకోగా, అదే సంవత్సరం ఎంఐటిలో గాంధీ మనవడు కానురాందాస్‌ గాంధీ పట్టభద్రుడయ్యారు. ఈ విషయాలను 2011 జనవరి 6న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది.
ఇలా తరచి చూస్తే గాంధీజీతో ముడిపడిన టెక్నాలజీ సంగతులు ఎన్నో ఉన్నాయి!

– డా. నాగసూరి వేణుగోపాల్

9440732392

Spread the love