డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌..

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో డీఎస్సీ (TS DSC 2024) పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఈ పరీక్షలపై అవగాహన కల్పించేలా టీ-సాట్‌ నెట్‌వర్క్‌ ప్రత్యేకంగా లైవ్‌ తరగతులు నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ 18 నుంచి 9 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 11గంటల నుంచి 12 గంటల వరకు నిపుణ ఛానల్‌లో వివిధ సబ్జెక్టులపై అవగాహన తరగతులు కొనసాగుతాయని టీ-శాట్‌ సీఈవో బి.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. మ్యాథమేటిక్స్‌, సైన్స్‌, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే ఈ లైవ్‌ ప్రోగ్రామ్స్‌ను మరుసటిరోజు విద్య ఛానల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి పునఃప్రసారమవుతాయని పేర్కొన్నారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసేవారు తమ సందేహాలను ఫోన్‌ కాల్‌ ద్వారా చర్చలో పాల్గొని నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం 040-23540326, 23540726 నంబర్లతో పాటు టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 825 4039ను సంప్రదించవచ్చని సూచించారు.

Spread the love