ఉద్యోగులకు మరో షాకిచ్చిన గూగుల్‌..

నవతెలంగాణ  – న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఉద్యోగులకు మరో షాకిచ్చింది. గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న ఈ సంస్థ 2024లో సైతం ఈ తొలగింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రకటనలు, అమ్మకాల విభాగం నుంచి వెయ్యి మందిని తొలగిస్తున్నట్టు గూగుల్‌ ఈ వారమే ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు ఇంకా ఆగిపోలేదని, ఈ ఏడాది మరింత అధికంగా ఉంటాయని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ నిర్ధారించారు. ఈ సందర్భంగా ‘లేఆఫ్‌’ అన్న పదాన్ని వాడటాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ ఏడాది సంస్థలో చేపట్టే భారీ మార్పుల గురించి ఇంటర్నెట్‌లో లీకైన ఆయన అంతర్గత మెమోలో వివరించారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా కంపెనీ సిబ్బందిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం గురించి ఆయన మాట్లాడారు. అయితే లేఆఫ్‌ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఆయన వ్యతిరేకించారు. దానికి బదులుగా సంస్థకు మీరు అవసరం లేదని చెప్పడం ఒక ఫ్యాన్సీ మార్గమని ఆయన పేర్కొన్నారు. కాగా, యూట్యూబ్‌లో సుమారు 100 మంది ఉద్యోగులపై గూగుల్‌ తాజాగా వేటు వేసింది.

Spread the love