రేపు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష

నవతెలంగాణ – హైదరాబాద్
గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్ష నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయగా.. గత అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఫలితాలనూ ప్రకటించారు. అయితే పేపర్‌ లీక్‌ నేపథ్యంతో ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేశారు. రద్దయిన పరీక్షను ఆదివారం (ఈ నెల 11న) నిర్వహించనున్నారు. గ్రూప్‌-1 పోస్టుల కోసం సుమారు 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష హాల్‌టికెట్లు కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఓఎంఆర్‌ షీట్‌ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి మఽధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులకు సూచనలు ఇచ్చేందుకు జిల్లాకొకటి చొప్పున 33 హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణలో భాగస్వాములయ్యే సిబ్బందిపై నిఘా పెట్టనున్నారు. పరీక్ష ప్రారంభానికి 2 గంటల ముందే కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లను మూసేస్తారు. అంటే ఉదయం 10.15 గంటలలోపే పరీక్ష హాల్‌లోకి అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనుమతించరు. అలాగే పరీక్ష కేంద్రంలోకి పెన్సిల్‌, ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌ వంటి వాటికి అనుమతి లేదు. బ్లూ, బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌లను మాత్రమే అనుమతించనున్నారు. అభ్యర్థులు షూతో వస్తే అనుమతించరు. చెప్పులు వేసుకుని రావాలి. నిబంధనలను అతిక్రమిస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నారు. ఇక గ్రూప్‌-1 పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీస్‌శాఖ పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీ స్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని అన్ని ఇంటర్నెట్‌, జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని కమిషనరేట్లు, ఎస్పీ కా ర్యాలయాల పరిధిలో ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్ష కేంద్రానికి 500 మీటర్ల దూరం వరకు జనం గుమిగూడరాదని ఆదేశాలిచ్చారు.

Spread the love