గూడ అంజయ్య పాటలు

రగిలించిన స్ఫూర్తి గొప్పది: సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు గూడ అంజయ్య గేయాలు, సాహిత్యం ప్రతీకలుగా నిలిచాయనీ, తెలంగాణ గోసను తనదైన యాసలో కైకట్టిన గూడ అంజయ్య పాటలు ప్రజల్లో రగిలించిన స్ఫూర్తి గొప్పదని సీఎం అన్నారు. గూడ అంజయ్య వర్ధంతి (జూన్‌ 21) సందర్భంగా సీఎం కేసీఆర్‌ వారి సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పాటల ద్వారా ఆయన చేసిన సాంస్కృతిక భావజ్యాల వ్యాప్తి, ప్రజలను కార్యరంగంలోకి దూకేలా చేసిందని సీఎం అన్నారు. సామాన్యులను సైతం ఆలోచింపచేసే వారి పాటలు ప్రజలను ఆలోచింపచేసి చైతన్యపరిచి, సాంస్కృతికోద్యమానికి ఊపిరిలూదాయని సీఎం తెలిపారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ వైద్య ఆరోగ్యరంగ దుస్థితికి ‘ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే వారి పాటకు నేటి తొమ్మిదేండ్ల ప్రగతి, సమాధానంగా నిలిచిందన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహౌన్నతంగా తీర్చిదిద్దుతున్న విధానం, అందుకు అనుగుణంగా ఆ రంగాన్ని ప్రజలు ఆదరిస్తున్న తీరు నిదర్శనమని అన్నారు. అమరుల ఆకాంక్షలను ప్రతిఫలిస్తూ, అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధిస్తూ, తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం తెలిపారు. అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని సీఎం తెలిపారు.

Spread the love